Take a fresh look at your lifestyle.

అన్నదాతకు అండగా…

  • అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను  మహబూబాబాద్‌ ‌జిల్లాలో   ఎరియల్‌ ‌వ్యూ ద్వారా, స్వయంగా పరిశీలించిన సిఎం కెసిఆర్‌
  • ‌సంబంధిత రైతులతో మాట్లాడిన సిఎం
  • పంట నష్టాల అంచనాలను అధికారులు, రైతులతోపాటు వివరించిన మంత్రి ఎర్రబెల్లి
  • అనంతరం వేదిక నుండి రైతులనుద్దేశించి మాట్లాడిన కెసిఆర్‌

మహబూబాబాద్‌/‌తొర్రూర్‌/‌పెద్దవంగర, ప్రజాతంత్ర, మార్చ్ 23 : అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నదాతకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వర్షాలతో పంటలు నష్టపోయిన మహబూబాబాద్‌ ‌జిల్లా తొర్రూర్‌, ‌పెద్దవంగర ప్రాంతాలను ముందుగా ఏరియల్‌ ‌వ్యూ ద్వారా, స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి తర్వాత సాగు క్షేత్రాలలో రైతులతో కలిసి ముచ్చటించారు. పంటల నష్టాలకు ఎక్కడైనా రూ.3 వేలే ఇస్తారని,  కానీ తాను పంటలు నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు నష్ట పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నానని, తాను హైదరాబాద్‌ ‌నుండే ఈ ప్రకటన చేయవచ్చు కానీ, స్వయంగా పంటల నష్టాలు చూడాలనుకున్నానని, రైతులను స్వయంగా ఓదార్చాలనుకున్నానని, రైతులతో మాట్లాడాలని భావించానని, అందుకే వొచ్చానని తెలిపారు. తానూ వ్యవసాయం చేస్తానని, మంత్రి నిరంజన్‌రెడ్డి, దయాకర్‌రావులు కూడా వ్యవసాయం చేస్తున్నారని, స్వయంగా తామంతా రైతులం కాబట్టి..

వ్యవసాయాన్ని కిందికి పడనీయవొద్దన్నది..వ్యవసాయాన్ని ఇగ వెనక్కి పోనీయకుండా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని, అందుకే తామంతా వొచ్చామని అన్నారు. ధైర్యం చెప్పడానికే వొచ్చినామని, మునపటిలాగా అగో అంటే ఆరు నెలలకు గాకుండా… నష్ట పరిహారాన్ని తొందరగానే చెల్లిస్తామన్నారు. కౌలుకు తీసుకున్న రైతులను కూడా ఆదుకోవాలని, ప్రభుత్వం దీనికి తప్పకుండా వారికి కూడా అండగా ఉంటుందని తెలిపారు. రైతులే కౌలుదారులను ఆదుకునే విధంగా కలెక్టర్లు వ్యవహరించాలని, రైతులే దయ తలచి వారిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్లు రైతులను, కౌలు రైతులను పిలిచి మాట్లడతారని తెలిపారు. రైతులు పొందే పరిహారంలోనే ఎంతో కొంత కౌలు రైతులకు కూడా అందే విధంగా చూస్తే… బాగుంటుందన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులను ఆదుకుంటున్నది తెలంగాణ రాష్ట్రమేనని, పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దన్నారు. నిరాశ పడొద్దని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ‌రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌ ‌రావు, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డి.ఎస్‌.‌రెడ్యానాయక్‌, ‌మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, ‌మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ‌నెమరుగొమ్ముల సుధాకర్‌ ‌రావు, చీఫ్‌ ‌సెక్రటరీ శాంతికుమారి, సిఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్‌, ‌వ్యవసాయశాఖ కమిషనర్‌ ‌రఘునందన్‌రావు, జిల్లా కలెక్టర్‌ ‌శశాంక, అడిషన్‌ ‌కలెక్టర్లు అభిలాష అభినబ్‌, ఎం.‌డేవిడ్‌, ‌సంబంధిత శాఖల  అధికారులు, రైతులు ఉన్నారు.

Leave a Reply