ఒక జాతి చరిత్రను భిన్న కోణాలలో, విభిన్న అంశాలతో అధ్యయనం చేసి ఆధార సహితంగా సప్రమాణికంగా నిరూపించి విశ్లేషణాత్మకంగా వెల్లడించే సారమే పరిశోధన. విస్తృతంగా వచ్చిన అనేకానేక పరిశోధనల్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఆ దిశగా విశ్వవిద్యాలయాల గురుతర భూమిక ఎంతటిదో తెలిసిపోతుంది. వేల సంఖ్యలో సిద్ధాంత వ్యాసాలు వస్తుంటే అవి ఏ అంశాల మీద, ఎక్కడ, ఎవరి పర్యవేక్షణలో, ఎవరు చేశారన్న సమాచారం పొందడం మాత్రం చాలా కష్టంగా మారింది. సరిగ్గా అలాంటి సంశయాలను నివృత్తి చేసేందుకు 2013లో ఆచార్య వెలుదండ నిత్యానందరావు వెలువరించిన విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధన అన్న గ్రంథం తోడ్పడింది. అంతకు ముందు 1975, 1986 ప్రాంతాల్లో తెలుగు అకాడమీ తెలుగు పరిశోధన సంహిత అన్న పేరుతో వివిధ తెలుగు శాఖలకు చెందిన సిద్ధాంత గ్రంథాల సంక్షిప్త సమాచారంతో రెండు సంపుటాలను వెలువరించింది. 2004లో దాక్షిణాత్య జానపద విజ్ఞాన సంస్థ పక్షాన ఆచార్య భక్తవత్సలరెడ్డి, డాక్టర్ భట్టు రమేశ్ల సంపాదకత్వంలో జానపద విజ్ఞానంలో పరిశోధనలు! సంక్షిప్త వివరణలు అనే గ్రంథాన్ని ప్రచురించింది.
2009, 2010లలో సిపి బ్రౌన్ అకాడమీ తెలుగు పరిశోధన వ్యాసమంజరి అన్న గ్రంథాన్ని వెలువరించారు. ఆయా గ్రంథాలన్నీ పరిశోధనల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తూనే వాటి వైశిష్ట్యాన్ని విస్తృతీకరించడంలో, పరిశోధనాత్మక దృష్టిని పెంపొందించడంలో విజయం సాధించాయని చెప్పొచ్చు. ఇలా తెలుగు పరిశోధనలపై వచ్చిన గ్రంథాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరొక బృహత్తర ప్రయత్నానికి డాక్టర్ అట్టెం దత్తయ్య శ్రీకారం చుట్టారు. 110 సిద్ధాంత గ్రంథాలను ఎన్నుకొని సారాంశం పేరుతో రెండు విశిష్ట సంపుటాలను వెలువరించారు. గతంలో వచ్చిన గ్రంథాలకు కొనసాగింపుగా, విభిన్నతలతో కూడిన వినూత్న పరిశోధనల ప్రత్యేకతగా వెలువడిన ఈ సంపుటాల బహుముఖ కృషికి ఆచార్య జీఎస్ మోహన్ అందించిన పరిశోధన స్వరూప స్వభావాలు అన్న వ్యాసం ప్రేరణగా నిలిచింది. ప్రామాణికతే ప్రాతిపదికగా ఎంపిక చేసుకున్న సిద్ధాంత గ్రంథాలను గురించి లోతైన విశ్లేషణలను అందించ గలిగే పరిశోధకులను సారాంశం రూపకల్పనలో భాగంగా గుర్తించి వారితో ఈ వ్యాసాలను సిద్ధం చేయించారు. 10 ప్రధాన అంశాల మీద దృష్టి సారించి సారాంశం రెండు సంపుటాలను రూపొందించారు. పరిశోధనకు సంబంధించిన ప్రాథమిక సమాచారం, పరిశోధనకు అనుసరించిన పద్ధతులు, పరిశోధనాంశ అధ్యాయాల విభజనలో పాటించిన పద్ధతి, అధ్యాయాలలో భాగంగా చర్చించిన అంశాల పరిచయం, సంబంధిత రంగంలో ఆ సిద్ధాంత గ్రంథ విశిష్టత, ఆ సిద్ధాంత వ్యాసం పూరించిన ఖాళీలు, పరిశోధన ఫలితాల క్రోడీకరింపు, పరిశోధనలో పాటించిన రచనాశైలి, రాబోయే పరిశోధకులకు అందించిన మార్గదర్శనం, సలహాలు తదనంతర పరిశోధనా రంగాలపై అది చూపిన ప్రభావం అన్న అంశాల ప్రాతిపాదికన సారాంశంలోని విశ్లేషణాత్మక వ్యాసాలన్నీ భావి పరిశోధకుల కోసం ఎంతో ఉపయుక్తంగా రూపొందాయి.
మంచి మార్గదర్శనంతో కూడిన ప్రేరణ అందిస్తూ ప్రామాణికతతో ఈ సంపుటాలలోని వ్యాసాలను పొందుపరిచారు. ఎన్నో విలువైన సిద్ధాంత గ్రంథాలు అనేక కారణాలతో ముద్రణకు, పునర్ముద్రణకు నోచుకోక అలభ్యస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులలో ఔత్సాహిక పరిశోధకులకు, పరిశోధక విద్యార్థులకు, సాహిత్యాభిలాషులకు మార్గదర్శనం, ప్రేరణ అందడానికి డాక్టర్ దత్తయ్య చేసిన సారాంశపు అడుగు మరొక బృహత్తర పరిశోధనాత్మక ప్రయత్నమనే చెప్పాలి. సారాంశం మొదటి సంపుటిని పరిశోధనల సారాన్ని తెలుగు సాహిత్యానికి సమగ్రంగా అందించిన ఆచార్య వెలుదండ నిత్యానందరావుకు, రెండవ సంపుటిని భాషా పరిణామాలను విపులంగా విశ్లేషించి పేరొందిన ఆచార్య వై రెడ్డి శ్రామలకు అంకితమిచ్చారు. ధ్రువ ఫౌండేషన్, ప్రణవం పబ్లికేషన్స్ 2021 ప్రచురణగా ఈ రెండు సంపుటాలు వెలువడ్డాయి. ధ్రువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దుండె లక్ష్మణ్ (అమెరికా), అధ్యక్షులు దుండె మల్లేశంలు సాహిత్యభిలాషులై సారాంశం సంపుటాలు వెలుగులోకి వచ్చేందుకు వెన్నుదన్నుగా నిలిచారు.
సారాంశం తొలి సంపుటిలో మొత్తం 55 వ్యాసాలుండగా తొలి వ్యాసం డాక్టర్ బిరుద రాజు రామరాజు పరిశోధన తెలుగు జానపద గేయ సాహిత్యము కాగా, 55వ వ్యాసం డాక్టర్ డింగరి నరహరి పరిశోధన వానమాములై జగన్నాధాచార్యులు రచనలు – భాషా సాహిత్య పరిశోధన. తొలి సంపుటికి డాక్టర్ నందిని సిధారెడ్డి, ఆచార్య సూర్యాధనంజయ్, ఘట్టమరాజు రాసిన ముందు మాటలలో అందులోని 55 సిద్ధాంత గ్రంథాలలోని ప్రామాణికతను, పరిశోధాత్మక విలువలను ప్రత్యేకంగా ప్రస్తావించి నూతన పరిశోధకులకు అవి ఎంతో మార్గదర్శకమని సూచించారు. రెండవ సంపుటిలో కూడా 55 వ్యాసాలున్నాయి. అందులో డాక్టర్ గండ్ర లక్ష్మణ్రావు పరిశోధన వేయిపడగలు – ఒక దర్శనం అన్నది తొలి వ్యాసం కాగా, డాక్టర్ తాళ్ళపల్లి యాకమ్మ పరిశోధన బోయ జంగయ్య సాహిత్యానుశీలనపై చివరి వ్యాసం. ఈ సంపుటికి డాక్టర్ బుక్కా బాలస్వామి, డాక్టర్ భిన్నూరి మనోహరి రాసిన ముందు మాటలు ఇందులోని ప్రదీపాత్మక పరిశోధనా గ్రంథాలు భావి పరిశోధకులకు ఎలా దిక్సూచిగా నిలుస్తాయన్న విషయాన్ని వెల్లడించారు. మొదటి రెండు సంపుటాలలో సారాంశ లోచనం, సారాంశ రోచనం పేరిట డాక్టర్ దత్తయ్య రాసిన సంపాదకీయ వివరణలు ఈ రెండు గ్రంథాల ప్రచురణ ఆంతర్యాన్ని విడమర్చి స్పష్టంగా ఆవిష్కరించాయి.
సారాంశం మొదటి సంపుటంలో వరుసగా డాక్టర్ బిరుదరాజు రామరాజు, డాక్టర్ పల్లా దుర్గయ్య, డాక్టర్ సి నారాయణరెడ్డి, డాక్టర్ ఎం కులశేఖరరావు, డాక్టర్ కె గోపాల కృష్ణరావు, డాక్టర్ హరి శివకుమార్, డాక్టర్ పాకాల యశోదారెడ్డి, డాక్టర్ ఎస్వీ రామారావు, డాక్టర్ ముకురాల రామారెడ్డి, డాక్టర్ వే. నరసింహారెడ్డి, డాక్టర్ యెల్దండ రఘుమారెడ్డి, డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి, డాక్టర్ ఏ. ప్రభాకరరావు, డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, డాక్టర్ కె.వి సుందరాచార్యులు, డాక్టర్ ముదిగొండ వీరేశలింగం, డాక్టర్ ఎన్.జి. రామానుజాచార్యులు, డాక్టర్ కోవెల సంపత్కుమారాచార్య, డాక్టర్ జి. చెన్నకేశవరెడ్డి, డాక్టర్ ఎన్. గోపి, డాక్టర్ కె. కోదండరామాచార్యులు, డాక్టర్ రవ్వా శ్రీహరి, డాక్టర్ వరవరరావు, డాక్టర్ కిడాంబి నరసింహాచార్య, డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, డాక్టర్ అందె వేంకటరాజం, డాక్టర్ చందూరి హైమవతి, డాక్టర్ కె బుక్నుద్దీన్, డాక్టర్ పేర్వారం జగన్నాథం, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, డాక్టర్ కె. సింగరాచార్యులు, డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ ఎం. గంగాధర్, డాక్టర్ బుక్కా బాలస్వామి, డాక్టర్ పైడిమర్రి మాణిక్ ప్రభు, డాక్టర్ జయధీర్ తిరుమలరావు, డాక్టర్ కె యాదగిరి, డాక్టర్ సంగనభట్ల నరసయ్య, డాక్టర్ ననుమాస స్వామి, డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య, డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ మసన చెన్నప్ప, డాక్టర్ శ్రీరంగాచార్య, డాక్టర్ అప్పం పాండయ్య, డాక్టర్ దాశరథుల నర్సయ్య, డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ వెలుదండ నిత్యానందరావు, డాక్టర్ మచ్చ హరిదాసు, డాక్టర్ డింగరి నరహరిలు వివిధ విశ్వ విద్యాలయాలలో విభిన్న సాహిత్య అంశాలపై చేసిన పరిశోధనలకు సంబంధించిన వ్యాసాలున్నాయి.
కాగా ఆయా వ్యాసాలను డాక్టర్ బుక్కా బాలస్వామి, డాక్టర్ యల్లంభట్ల నాగయ్య, డాక్టర్ జి. బాలశ్రీనివాసమూర్తి, వేదార్థం మధుసూదనశర్మ, డాక్టర్ పల్లేరు వీరస్వామి, డాక్టర్ వేలూరి శ్రీదేవి, డాక్టర్ బూదాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ సంగనభట్ల నర్సయ్య, డాక్టర్ అట్టెం దత్తయ్య, డాక్టర్ దహగం సాంబమూర్తి, తాటికొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ వెలుదండ నిత్యానందరావు, డాక్టర్ మంత్రి శ్రీనివాస్, డాక్టర్ వి. త్రివేణి, డాక్టర్ కె.కె వెంకటశర్మ, డాక్టర్ బి. బాలకృష్ణ, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, డాక్టర్ జి విజయ్కుమార్, డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి, బోళ్ల ప్రవీణ్కుమార్, ఘట్టమరాజు, చీపిరిశెట్టి కవిత, డాక్టర్ పి. వారిజారాణి, డాక్టర్ సి. యాదగిరి, ఎన్ వేణుగోపాల్, కె. వెంకట నర్సింహాచార్య, అవుసుల భానుప్రకాశ్, డాక్టర్ కె. జోత్స్న ప్రభ, డాక్టర్ తిరునగరి శరత్చంద్ర, డాక్టర్ వి. జయప్రకాశ్, డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ, డాక్టర్ ఆర్ సూర్యప్రకాశ్రావు, డాక్టర్ కందాల శోభారాణి, డాక్టర్ మండల స్వామి, డాక్టర్ బర్ల మహేందర్, డాక్టర్ భూదాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి, మామిడి సంతోష్ గౌడ్, వర్ద వేణు, డాక్టర్ సళ్ల విజయ్కుమార్, డాక్టర్ బి. మనోహరి, డాక్టర్ చంద్రయ్య, రమాదేవి, గిరిజా మనోహరబాబు, డాక్టర్ సావిత్రిబాయి, డాక్టర్ బి.వి.ఎన్ స్వామి తదితరుల విశ్లేషణాత్మక వ్యాసాలు ఉన్నాయి.
సారాంశం రెండవ సంపుటంలో వరుసగా డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, డాక్టర్ ఎం ప్రమీలారెడ్డి, డాక్టర్ మారంరాజు ఉదయ, డాక్టర్ యం.డి రాజ్మహ్మద్, డాక్టర్ ఎన్.ఆర్ వెంకటేశం, డాక్టర్ వి. వీరాచారి, డాక్టర్ కాలువ మల్లయ్య, డాక్టర్ పరవస్తు కమల, డాక్టర్ టి. శ్రీరంగస్వామి, డాక్టర్ బన్న అయిలయ్య, డాక్టర్ పంతంగి వెంకటేశ్వర్లు, డాక్టర్ మలయశ్రీ, డాక్టర్ సిహెచ్. సీతాలక్ష్మి, డాక్టర్ ఎన్. రజని, డాక్టర్. జి. బాలశ్రీనివాసమూర్తి, డాక్టర్ జె చెన్నయ్య, డాక్టర్ వై. ఎ. విశాలక్షి, డాక్టర్ గంగు కిషన్ప్రసాద్, డాక్టర్ అయాచితం శ్రీధర్, డాక్టర్ వేలూరి శ్రీదేవి, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య, డాక్టర్ కళామురళి, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, డాక్టర్ కె శ్రీనివాస్, డాక్టర్ కాకునూరి సత్యనారాయణ, డాక్టర్ వి. శంకర్, డాక్టర్ కంచి విజయలక్ష్మి, డాక్టర్ గుండెడప్పు కనకయ్య, డాక్టర్ బండారు సుజాతశేఖర్, డాక్టర్ ఎం. పురుషోత్తమాచార్యులు, డాక్టర్ సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి, డాక్టర్ సాగి కమలాకర శర్మ, డాక్టర్ బి. మనోహరి, డాక్టర్ గుఱ్ఱం విజయ్కుమార్, డాక్టర్ కె.వి రమణాచారి, డాక్టర్ తిరునగరి దేవకీదేవి, డాక్టర్ రాళ్ళబండి కవితా ప్రసాద్, డాక్టర్ సూర్యా ధనంజయ్, డాక్టర్ చాట్ల నర్సయ్య, డాక్టర్ యాకుబ్, డాక్టర్ అడువాల సుజాత, డాక్టర్ జె. నీరజ, డాక్టర్ సి. కాశీం, డాక్టర్ వై. గీతావాణి, డాక్టర్ పి. భాస్కరయోగి, డాక్టర్ ఆకునూరు విద్యాదేవి, డాక్టర్ కందాళ శోభారాణి, డాక్టర్ పసునూరి రవీందర్, డాక్టర్ చింతనూరి కృష్ణమూర్తి, డాక్టర్ పుట్ట యాదయ్య, డాక్టర్ కొండపల్లి నీహారిణి, డాక్టర్ బూర్ల చంద్రశేఖర్, డాక్టర్ తాళ్ళపల్లి యాకమ్మలు చేసిన పరిశోధనలకు సంబంధించిన విశ్లేషణాత్మక వ్యాసాలున్నాయి.
ఆయా పరిశోధనలకు సంబంధించిన వ్యాసాలను డాక్టర్ జె భారతి, ఘట్టమరాజు, ఘనపురం సుదర్శన్, డాక్టర్ సూర్యా ధనంజయ్, డాక్టర్ ఏలె విజయలక్ష్మి, వి సత్యవతి, మునగపాటి అరవింద, డాక్టర్ వీపూరి వెంకటేశ్వర్లు, డాక్టర్ నమిలికొండ సునీత, డాక్టర్ కర్రె సదాశివ్, వై సత్యనారాయణ, స్తంభంకాడి గంగాధర్, డాక్టర్ ఎం దేవేంద్ర, పంబాల మురళీకృష్ణ, డాక్టర్ వై. రెడ్డి శ్యామల, డాక్టర్ వడ్కాపురం కృష్ణ, డాక్టర్ అట్టెం దత్తయ్య, డాక్టర్ పగడాల నాగేందర్, డాక్టర్ వి జయప్రకాశ్, డాక్టర్ చెమన్, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, డాక్టర్ బైరోజు శ్యామ్సుందర్, డాక్టర్ వోలేటి పార్వతీశం, టి శ్రీవల్లి రాధిక, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ సాగి కమలాకర్ శర్మ, పిల్లి సురేశ్, డాక్టర్ సయ్యద్ అఫ్రిన్ బేగం, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, గురిజాల రామశేషయ్య, డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి, డాక్టర్ బి సూర్యకుమార్, డాక్టర్ జి వెంకటలక్ష్మి, డాక్టర్ వెలుదండ నిత్యానందరావు, డాక్టర్ వెల్దండి శ్రీధర్, డాక్టర్ పి సావిత్రిభాయి, యడవల్లి సైదులు, జమ్మిడి మహేందర్, డాక్టర్ ఎన్. వి రమణ, డాక్టర్ చంద్రయ్య ఎస్, కోడం కుమారస్వామి, డాక్టర్ మంత్రి శ్రీనివాస్, డాక్టర్ టి. శ్రీరంగస్వామి, డాక్టర్ వి. వీరాచారి, డాక్టర్ సీతారాం, మ్యాతరి ఆనంద్, తాటికొండ లక్ష్మీనారాయణ, గాలిపెల్లి వెంకన్న పరిశోధనాత్మక విశ్లేషణలతో అందించారు.
అభివృద్ధి వికాసాల వైపు సాహిత్య పరిశోధన నడిచిన తీరును ఈ రెండు సంపుటాలలోని సిద్ధాంత గ్రంథాలకు సంబంధించిన వ్యాసాలలో రచయితలు చాలా స్పష్టంగా వెల్లడించారు. కాలానుగుణంగా చోటు చేసుకుంటున్న ప్రమాణాలను నిర్ధారించడంలో సాహిత్యమే తప్పనిసరిగా కీలకమైన ఆధారమవుతుంది. పాత, కొత్తల మేలు కలయికలను విశ్లేషిస్తూ కాలానుగుణమైన భావోద్వేగాలు, సాహిత్య సాంస్కృతిక విలువలు, జీవన పోకడలను శాస్త్రీయంగా మధించి ఒక సప్రమాణ సారాంశంగా మలచి భవిష్యత్తు ఉన్నతీకరణ కోసం 110 పరిశోధనలు సాగిన తీరును ఈ సంపుటాలలోని 1200 పేజీలలో సవివరంగా ప్రచురించిన వ్యాసాలు వెల్లడించాయి. సత్యశోధన, విషయ స్పష్టత, ఆధార సహిత నిరూపణ, సమగ్రాధ్యయనం, సమన్వయం, సంయమనం , సాలోచన, పరిశోధనా పద్ధతుల బేరీజు, శాస్త్రీయ దృష్టి కోణం, విశేషాంశాల ఆవిష్కరణ, సామాజిక భాషా దృక్పథం, గతంలోని కొన్నింటిని వదిలించుకొని కాలానుగుణంగా తప్పనిసరిగా స్వీకరించాల్సిన నవ్య మార్గాలు, పద్ధతులు, మారిన ప్రాపంచిక మానవ జీవన స్థితిగతుల వంటి ఎన్నెన్నో వైవిధ్య అంశాలను ప్రతిబింబింపజేస్తూ రచయితలు సమగ్రతను పెంపొందించే లోతైన విశ్లేషణతో కూడిన ప్రమాణాత్మక పరిశోధన వ్యాసాలను అందించారు.
మారిన జీవనం, పెరిగిన అనూహ్య వేగంతో విపుల శోధనకు, విశేష ఫలిత సాధనకు పరిశోధనలు దూరమవకుండా గత వైభవాన్ని నిలుపుకుంటూనే సరికొత్త దీప్తితో ముందుకు సాగాలన్న ఆకాంక్షతో కూడిన మార్గదర్శనం, విమర్శనాత్మక సమీక్షణంతో పాటు పరిశోధనా పద్ధతుల అవలంబనకు సూచనలు సారాంశం సంపుటాలలోని వ్యాసాల విశ్లేషణల్లో స్పష్టంగా వ్యక్తమయ్యాయి. భావి పరిశోధకుల కోసం వారి కృషిలో తోడ్పడే విధంగా ఎంతో దీక్షా దక్షతతో డాక్టర్ దత్తయ్య ఈ రెండు సంపుటాలను రూపొందించి అందించారు. నవ్య పరిశోధకులకు ఈ సంపుటాలు దిక్సూచులుగా తప్పనిసరిగా ఉపకరిస్తాయి.
-డా.తిరునగరి శ్రీనివాస్
8466053933





