-కేసీఆర్ నువు రాకపోతే కేటీఆర్, హరీష్ ను పంపు
-టీఆరెస్ కు 25కు మించి సీట్లు రావు
-అందుకే కేసీఆర్ కాంగ్రెస్ పై దాడి చేస్తున్నారు
-అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారు
-నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న ముందే చెప్పారు
-టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.
తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రాలేకపోతే కేటీఆర్, హరీష్ ను పంపాలన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. దిల్లీ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తండ్రీ కొడుకుల తీరుపై విమర్శలు కురిపించారు. ‘‘ టీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచింది. పోలవరం టెండర్లు వేసింది, పులిచింతల కట్టింది మీరు మంత్రులుగా ఉన్నప్పుడే. నేను లేవనెత్తిన అంశాలపై, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు నేను సిద్ధంగా ఉన్న… కేసీఆర్ నువ్వు నా పేరు ఎత్తలేవు.. నీ కొడుకు కేటీఆర్ నా కళ్ళలోకి సూటిగా చూడలేడు.. అందుకే చర్చకు అల్లుడు హరీష్ ను పంపు’’ అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వొచ్చే
ఎన్నికల్లో బీఆరెస్ కు 25 సీట్లకు మించి రావని, అందుకే కేసీఆర్ కాంగ్రెస్ పై దాడి చేస్తున్నారన్నారు. కేసీఆర్ అండ్. కో అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారని, శాసనసభలో గద్దర్ కు సంతాపం తెలపకపోవడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ‘‘కాంగ్రెస్ ను కేసీఆర్, కేటీఆర్ చాలా అభ్యంతరకరంగా దూషించారు. తండ్రీ కొడుకులు చర్చను రేవంత్ రెడ్డి చుట్టూనే తిప్పారు. సభలో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నారు’’ అని సభ జరిగిన తీరుపై రేవంత్ విమర్శలు కురిపించారు. పదే పదే తనను చంద్రబాబు శిష్యుడినని తండ్రీ, కొడుకులు విమర్శిస్తున్నారని.. కానీ తాను చంద్రబాబుకు సహచరుడిని మాత్రమేనని ఆయన తెలిపారు. ‘‘టీడీపీలో నేను చంద్రబాబు నాయుడుకు శిష్యుడిని కాదు..సహచరుడిని. నా ప్రస్థానం టీడీపీలో చంద్రబాబు సహచరుడుగా మొదలైంది. ఎమ్మెల్సీగా గెలిచాకే నేను టీడీపీలో చేరాను. కానీ టీడీపీలో కేసీఆర్ ప్రస్థానం చంద్రబాబు అనుచరుడిగా మొదలైంది. నిలువ నీడ లేని కేసీఆర్ కు టీడీపీనే ఆధారమైంది’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పట్ల తన నిబద్ధత ఎప్పుడూ మారలేదన్నారు. తెలంగాణ సమస్యలపై ప్రశ్నించడంలో ముందున్నానని చెప్పారు. కానీ కేసీఆర్ చంద్రబాబుతో ఉన్నప్పుడు 610 జీఓ పై తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరించారని గుర్తుచేశారు. 1996లో 610జీఓ ను, జోనల్ విధానం రద్దు చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన ద్రోహి కేసీఆర్ అని విమర్శించారు. మంత్రి కేటీఆర్ 1996 లో మంత్రిగా కేసీఆర్ మాట్లాడిన మాటలు వినాలని సూచించారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాకారమైందని 13 జూన్ 2014లో శాసనసభలో చెప్పిన కేసీఆర్… ఇప్పుడు కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డిని దోషిగా ఎలా నిలబెడతారని ప్రశ్నించారు.
‘‘తెలంగాణ కోసం 2011లో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నది, నిలదీసింది నేను… చంద్రబాబు సహచరుడుగా ఉన్నా ఆనాడు తెలంగాణపై నా నిబద్ధత మారలేదు. ఆనాడు గవర్నర్ పై దాడి ఘటనలో సభ నుంచి సస్పెండ్ అయ్యాను. 24 జనవరి 2014లో సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై 54 నిమిషాలు సభలో వివరించా.. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని నొక్కి చెప్పా.. అప్పర్ సీలేరు, లోయర్ సెలేరులో తెలంగాణ కు అన్యాయం జరుగుతుందని చెప్పా.. ఎవరికి తలవంచకుండా తెలంగాణ కోసం మాట్లాడిన నిఖార్సైన తెలంగాణ బిడ్డను నేను..’’ అని తెలంగాణపై తనకున్న నిబద్ధతను గుర్తుచేశారు. తాను ఏ స్థాయిలో ఉన్నా తెలంగాణ పక్షానే ఉన్నానని, పాలక పక్షాలకు నేను ఎన్నడూ అమ్ముడు పోలేదన్నారు. పార్టీలు మారి ఉండవచ్చు కానీ తెలంగాణ వాదాన్ని వీడలేదన్నారు. పొన్నం, వివేక్ వెంకటస్వామి, జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని వ్యతిరేకించి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లేనని గుర్తు చేశారు.
కేసిఆర్ కుటుంబం ఇప్పుడు అనుభవిస్తుందంతా కాంగ్రెస్ బిక్షనే అన్నారు రేవంత్ రెడ్డి. ‘‘కాంగ్రెస్ లేకపోతే కెసిఆర్ కుటుంబం బిచ్చమెత్తుకునేది. కేసిఆర్ ని కేంద్రంలో మంత్రిని చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేగా గెలవకపోయినా హరీష్ రావు ను మంత్రిని చేసింది కాంగ్రెస్. కేకే మహేందర్ కు వెన్నుపోటు పొడిచి కేటీఆర్ ను కేసీఆర్ గెలిపించుకుంది నిజం కాదా? టీడీపీ కండువా కప్పుకుంటేనే సిరిసిల్లలో కేటీఆర్ మొదటిసారి గెలిచింది. మహబూబ్ నగర్ లో ఎంపీ గా గెలిపించింది నేను కాదా?. అప్పుడు టీఆర్ఎస్ జెండా మోసేవాడే లేడు. టీడీపీ, కాంగ్రెస్ లో ఉండి తెలంగాణ కు మోసం చేసింది కేసిఆర్. టీడీపీ, కాంగ్రెస్ లు నష్టం చేశాయని చెప్పే కెసిఆర్… అప్పుడు ఎన్నికల్లో వాటితోనే ఎందుకు పొత్తు పెట్టుకున్నారు?. మాజీ ఎమ్మెల్సి రంగారెడ్డి శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలను అమ్ముకున్నది కెసిఆర్, వ్యాపారం చేసింది హరీష్ రావు కాదా?. సమైక్య ఆంధప్రదేశ్ కోసం నెలల తరబడి ఉద్యమం చేసిన జగన్ ను ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టావు.. తెలంగాణ ద్రోహులతో అంటకాగింది కెసిఆర్. పార్టీ పెట్టేందుకు ఆఫీస్ ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వ్యక్తి చనిపోతే కనీసం నివాళి అర్పించేందుకు వేళ్ళని కుసంస్కారి కెసిఆర్’’ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.2011లో కేసీఆర్ తో పొత్తు పెట్టుకుని ఇప్పుడు కిషన్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని తెలిపారు. తెలంగాణ ద్రోహులతో అంటకాగిన కేసీఆర్ దుర్మార్గుడని, లాలూచీలో కేసీఆర్ ను మించినవారు ఈ దేశంలో ఇక పుట్టరన్నారు. ఏ రోకటి కాడ ఆ పాట పాడే వ్యక్తి కేసీఆర్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘గద్దర్ 2019మొదలు పెట్టిన తుది దశ తెలంగాణ ఉద్యమం సాకారం కావాలి. గద్దర్ చివరి కోరిక, ఆకాంక్ష నెరవేర్చేందుకు ఆయన స్ఫూర్తిని మేం కొనసాగిస్తాం. నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న నాతో చెప్పారు. యుద్ధం వ్యూహాత్మకంగా చేయాలని నాకు సూచించారు..కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని.. జాగ్రత్తగా ఉండాలని ఆయన అప్పుడే చెప్పారు. లక్ష్యాన్ని చేరేవరకు కార్యదీక్షతో పనిచేస్తామని కేసీర్ ను హెచ్చరిస్తున్నా’’అని రేవంత్ రెడ్డి అన్నారు.




