వ్యవసాయ శాఖలో సాంకేతికతను ఉపయోగించాలి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : వ్యవసాయ శాఖలో సాంకేతికతను జోడించి రైతులకు మేలు చేసే సాంకేతిక కంపెనీలతో తమ ప్రభుత్వం కలిసి పని చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉపగ్రహ ఛాయా చిత్రాల డాటాను వివిధ అవసరాలకు వాడుకునే విధంగా వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలను కూడా భాగస్వాములను చేస్తామని తెలిపారు. బుధవారం సెక్రటేరియట్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపితో పాటు వివిధ సాంకేతిక కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పంటలలో చీడపీడలను ముందుగానే గుర్తించి, రైతులను ముందుగానే అలర్ట్ ఇవ్వడం, ప్రకృతి వైపరీత్యాల్లో జరిగే పంట నష్టంపై త్వరితగతిన అంచనా వేయడం, పంటల కొనుగోళ్లకు సంబంధించి ముందుగానే దిగుబడులు అంచనావేయడం అదేవిధంగా నమోదైన సాగువిస్తీర్ణాలను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా సరిపోల్చడం, ఇలా ప్రతీ అంశంలో ఏఐని వాడుకొనే దిశలో తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు.

ఆ దిశగా సాంకేతికతను జోడించి రైతులకు మేలు చేసే సాంకేతిక కంపెనీలతో తమ ప్రభుత్వం కలిసి పని చేస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ సమావేశానికి హాజరైన ఇక్రిశాట్, అగ్రివాస్ కంపెనీ ప్రతినిధులు వివిధ రాష్ట్రాల్లో సాంకేతికతను వినియోగించి వారు అమలు చేస్తున్న పథకాలను తెలియజేశారు. ముఖ్యంగా చీడ పీడలను ముందే గుర్తించి హెచ్చరికలు జారీ చేసే సిస్టం ద్వారా రైతులను అప్రమత్తం చేయడం, దిగుబడుల అంచనా, సర్వే నెంబర్ వారీగా సాగైన విస్తీర్ణం, మున్నగునవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

వ్యవసాయ కార్యదర్శి మాట్లాడుతూ, ఆయా కంపెనీలు సాంకేతిక సామార్థ్యం, అమలు తీరు అవసరమయ్యే నిధులు, రైతులకు కలిగే ప్రయోజనాల గురించి డీపీఆర్ సమర్పించాల్సిందిగా ఆదేశించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ అన్నింటిని పరిశీలించి ముఖ్యమంత్రి ఆమోదం మేరకు సదరు కంపెనీలతో కలిసి పనిచేసే దిశగా ప్రయత్నిస్తానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page