ఆర్ అండ్ బి ఆస్తుల సంరక్షణకు పటిష్ట చర్యలు
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మేరకు రహదారులను నిర్మించాలి
ఆర్అండ్బి శాఖ ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖ ఫ్రీ బడ్జెట్ సంవత్సరం పలు అంశాలు చర్చించారు. రీజినల్ రింగ్ రోడ్డు డిపిఆర్, త్రీడీ డిజైన్లు వంటి పనులు వేగవంతం చేయాలని, నిధుల కొరత లేదని వారు తెలిపారు. ఎంత వేగంగా పనులు చేపడితే అంత వేగంగా నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బి శాఖకు ఉన్న ఆస్తులపై నివేదిక రూపొందించాలని, పెద్ద సంఖ్యలో ఉన్న విలువైన ఈ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా అధికారులు అన్ని స్థాయిల్లో చర్యలు చేపట్టాలని ఇరువురు మంత్రులు ఆదేశించారు. హైబ్రిడ్ యాన్యూటీ హెడ్ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు.
జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వొచ్చే రహదారులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. వివిధ పనులపై ప్రతిరోజు వేలాదిమంది జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ కు వివిధ పనుల కోసం వొస్తుంటారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులు పనులు చేపట్టి నిధులు సద్వినియోగం చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చాం, గత పదేళ్ల పాటు పాలించిన వారు ఈ సబ్ ప్లాన్ చట్టాన్ని నిర్లక్ష్యం చేశారని తెలిపారు. తిరిగి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిస్థాయిలో అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చట్టం నిధుల మేరకు స్థానికంగా పనులు చేపడుతున్న విషయాన్ని ఆ ప్రాంత నేతలు, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఆర్ అండ్ బి శాఖ అధికారులపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆర్ అండ్ బీ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఏవియేషన్ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని మంత్రులు తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్ రాజ్,డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్,సెక్రటరీ దాసరి హరిచందన, ఆర్థిక శాఖ సెక్రెటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.
హాస్టళ్లు, గురుకులాల అద్దె భవనాల బకాయిలు చెల్లిస్తాం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టాలని, ఉద్యోగ కల్పన కేంద్రాలుగా స్టడీ సెంటర్లో ఉండాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల అద్దె బకాయిలను వెంటనే చెల్లిస్తామని, ప్రతిపాదనలు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో మరమ్మతులు చేపట్టాలి, కిటికీలు, ప్రధాన ద్వారాలు కూడా దోమతెరలు ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన నిధులు వెంటనే కేటాయిస్తామని మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తెలిపారు.
బీసీ స్టడీ సెంటర్లు ఉద్యోగ కల్పన కేంద్రాలుగా ఉండాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్ను అనుసరించి స్టడీ సెంటర్లలో కోచింగ్ నిర్వహించాలని కోరారు. డీఎస్సీ, బ్యాంకింగ్ వంటి పరీక్షల పైన దృష్టి సారించాలని ఆదేశించారు. గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రవేశం పెట్టడం మూలంగా ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ కోర్స్ తో పాటు ఒక కోర్స్ ఒకేషనల్ కోర్సులకు కేటాయించాలని.. అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యార్థులు పూర్తిగా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ఒకేషనల్ కోర్సులు ప్రవేశ పెడితే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు.. వాటి నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. ఆర్టీసీ ఆస్తులు.. నిర్వహణ, ఆదాయ వనరులపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఆర్టీసీ ఎండి సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.