గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కాంగ్రెస్ నేతల భేటీ
కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొన్నం, తదితరులు
హైదరాబాద్, ప్రజాతంత్ర,మే 2 : కాంగ్రెస్ బీసీ నేతలు శుక్రవారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కేకే, మధుయాష్కీ నేతృత్వంలో గవర్నర్ను కలిశారు. బీసీలకు రాజకీయ, విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో చేసిన బిల్లుకు గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపినందుకు కాంగ్రెస్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా గవర్నర్ను కలిసిన వారిలో ప్రభుత్వ విప్ బీర్ల ఆయిలయ్య, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, మేయర్ విజయలక్ష్మి తదితరలు ఉన్నారు. స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్చి 18న శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు ఆమోదం పొందాయి.
ఆ మరుసటి రోజు మంగళవారం వాటిని శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన అనంతరం వాటిని ప్రభుత్వం గవర్నర్కు పంపారు. ఆయన వాటిని పరిశీలించి.. రాష్ట్రపతికి పంపారు. తొలుత.. ’తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ (విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు) బిల్లు-2025’, ’తెలంగాణ బీసీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బిల్లు-2025’ను మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 29 శాతం. వాటిని 42 శాతానికి పెంచుతూ ఆమోదించిన బిల్లు చట్ట రూపం దాల్చాలంటే.. పార్లమెంటు-లో 2/3 మెజారిటీతో వాటికి ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకు కారణం..
సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరికీ అమలు చేసే రిజర్వేషన్లన్నీ కలిపి 50 శాతాన్ని మించకూడదని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఒకవేళ.. రిజర్వేషన్లను పెంచితే వాటిని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాల్సి ఉంటుది. అందుకే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 (సి) ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతున్నట్టు బిల్లుల్లో పేర్కొంది. న్యాయ సలహా తీసుకుని రాష్ట్రపతి వాటిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అవి చట్టపరంగా నిలబడాలంటే మాత్రం.. బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. అప్పుడు మాత్రమే అవి రాజ్యాంగంలోని షెడ్యూల్-9 లో చేరి, వాటికి రాజ్యాంగ రక్షణ లభిస్తుంది.