పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు.. ఆ బాధ్యత టామ్‌కామ్‌దే

– స్కిల్ వర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి
– ఏటీసీల్లో అత్యాధునిక కోర్సులకు ప్రాధాన్యం
– డిమాండ్‌కు తగినట్లు నర్సింగ్ కళాశాలల ఏర్పాటు
– శక్తి శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతోపాటు ఉద్యోగార్ధులకు అవసరమైన పాస్‌పోర్టు, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్‌కాం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. శక్తి శాఖపై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్తుంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బందిపడుతున్నారని సీఎం తెలిపారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి టామ్‌కాం పాస్‌పోర్టులు ఇప్పించడంతోపాటు వారు వెళ్లే దేశాల్లోని మ్యాన్‌పవర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. విదేశీ కంపెనీలతో టామ్‌కాం ఒప్పందం చేసుకోవడం ద్వారా అక్కడకు వెళ్లిన వారికి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే చర్చలు జరపడానికి, వారికి న్యాయం చేయడానికి వీలుంటుందని అభిప్రాయపడ్డారు. కార్మికులను విదేశాలకు తరలించే ఏజెంట్ల వివరాలు సేకరించి వారు పంపించే ప్రతీ వ్యక్తి వివరాలు నమోదు చేయాలని సీఎం సూచించారు. ఈ వ్యవహారాల పర్యవేక్షణకు టామ్‌కాంకు మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారిని సీఈవోగా నియమిస్తామని తెలిపారు. ఉద్యోగార్దులకు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లోనూ శిక్షణ ఇప్పించాలన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలకు అవసరమైన రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. జర్మనీ, జపనీస్, కొరియన్, చైనీస్, రష్యన్ తదితర భాషలు నేర్చుకునేందుకు వీలుగా స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలన్నారు. విదేశీ భాషలు నేర్పేందుకు స్థానికంగా ఆ భాషలో పట్టున్న వారితోపాటు ఆయా దేశాలకు చెందిన శిక్షకులను రప్పించాలని సీఎం చెప్పారు. యూనివర్సిటీ ప్రాంగణంలో రీలొకేటెడ్ చెట్లను నాటాలని సూచించారు. ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు ఇచ్చినట్లే బ్లూ కాలర్ జాబ్‌లకు శిక్షణ పొందేవారందరికీ స్కాలర్‌షిప్‌లు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పించాలని అన్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా వారికి స్టైఫండ్ లభిస్తుందని, భవిష్యత్‌లో చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకుంటారని అన్నారు. ఏటీసీల్లో ఈవీ సర్వీసులకు సంబంధించిన కోర్సులు, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలని సీఎం సూచించారు. ఈవీల వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వాటి సర్వీసింగ్ చేయగలిగిన వారు అవసరమన్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం భారీగా పెరుగుతున్నందున డ్రోన్ టెక్నాలజీ కోర్సు ఉండాలని సీఎం సూచించారు. దేశీయంగానూ, విదేశాల్లోనూ నర్సుల సేవలకు భారీ డిమాండ్ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో ఇంటికో నర్సు డిమాండ్ ఉందని, అందుకు అనుగుణంగా నర్సింగ్ కళాశాలలకు అనుమతులు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, శక్తి కార్యదర్శి హరిచందన, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ నిర్మలా కాంతి వెస్లీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *