తుది ద‌శ‌లో ఔట‌ర్ రింగ్‌రోడ్డు-కొండాపూర్ ఫ్లైఓవర్

జూన్‌లో ప్రారంభించ‌నున్న సి.ఎం.రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  మే 27:   ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ ఫ్లైఓవర్ (Outer Ring Road-Kondapur Flyover ) త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వొస్తే  హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆఆర్ ఆర్) నుండి కొండాపూర్‌కు వెళ్లే అత్యాధునిక మల్టీ-లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ మొదటి వారంలో  ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది.
ఈ ఫ్లైఓవర్‌ను రూ.178 కోట్ల వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ ఆర్ డీపీ) కింద నిర్మించారు. 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో ఇది అందుబాటులోకి రానుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై నిర్మించిన మూడవ స్థాయి నిర్మాణం. కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉండగా, ఇప్పుడు దానికి పైన ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించారు. దీని నిర్మాణంతో ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ఈ ఫ్లైఓవర్ చాలా వరకు తగ్గిస్తుంది.
 
మెరుగైన కనెక్టివిటీ
ఓ ఆర్ ఆర్  నుండి కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది.ప్రయాణ సమయం ఆదాతో పాటు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.

కొండాపూర్ ప్రాంతం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అక్కడి నుండి కొండాపూర్  ప్రాంతాలకు వెళ్ళేందుకు గచ్చిబౌకోవద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లి వెసులుబాటు క‌లుగుతుంది.  జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేశారు. గతంలో కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయినప్పటికీ, పనులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. ఈ ఫ్లై ఓవర్ ను పూర్తి చేయడానికి కమిషనర్ ఆర్.వి.కర్ణన్ పలు సార్లు పర్యటన చేసి వేగవంతంగా పూర్తి  చేయుటకు ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. ఎస్.ఆర్.డి.పి ద్వారా హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీఠ వేసిన నేపథ్యంలోఈ ప్రాజెక్టు ద్వారా 23వ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానున్నది. ఎస్.ఆర్.డి.పి ద్వారా  చేపట్టినా ఫ్లై ఓవర్ లు నగరంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేరుగా నిర్దేశించిన సమయంలో గమ్య స్థానానికి చేరుకోవచ్చు.  సి.ఆర్.ఎం.పి ద్వారా, ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన పనులు పూర్తి కావడంతో గతంలో కంటే ఎక్కువ వేగంగా వెళ్లేందుకు స్పీడ్ పెంచడం జరిగింది. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన మొత్తం 42 పనులలో ఈ ఫ్లై ఓవర్ తో 37 పనులు పూర్తి అయ్యాయి. ఫలక్‌నామా రైల్వే ఓవర్ బ్రిడ్జి ,శాస్త్రి పురం ఆర్.ఒ బి పనులు రైల్వే పోర్షన్ రెండు మూడునెలలు లో పూర్తి చేయాలని ల‌క్ష్యంగా నిర్ణయించి కమిషనర్ ఆర్.వి కర్ణన్ రైల్వే అధికారులను కోరారు. వారికి జులై నెల చివరి వరకు ఫలక్ నూమా ఆర్.ఓ.బి, ఆగస్టు నెల చివరి వరకు శాస్త్రిపురం ఆర్.ఓ.బి పనులను పూర్తిచేయాలని కమీషనర్ టార్గెట్ పెట్టారు. ఈ రెండు ఆర్.ఓ.బి లు పూర్తయితే ఎస్.ఆర్.డి.పి పనులు 39 పనులు పుటవుతాయి.. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనదారులు వెళ్లవచ్చు.

ఇదిలా ఉండగా ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి రావడం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు మౌలిక సదుపాయాలకు పెద్ద పీట‌ వేశారు. గతంలో జీహెచ్ఎంసి కి ఇచ్చిన  హామీ మేరకు నగర అభివృద్ధికి నిధులను మంజూరు చేసి జిహెచ్ఎంసి కి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో నగర అభివృద్ధికి హెచ్ సిటీ ద్వారా రూ. 7032 కోట్ల వ్యయంతో 58 పనులు చేపట్టనున్నారు. అందులో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్ పాస్ లు,  ఆర్.ఓ.బి లు 4, రైల్వే అండర్ బ్రిడ్జి 03, రోడ్డు వెడల్పు 10 పనులను చేపట్టేందుకు ప్రతిపాదించారు. ఈ పనులను టెండర్ దశ పూర్తిచేసి అగ్రిమెంట్ దశలో కలవు. ఈ పనులను కొన్ని జూన్ మాసంలో ప్రారంభమయ్యే అవకాశ‌ముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *