కార్మిక సంఘాలను ఆహ్వానించిన ఆర్టీసీ
ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీస్పై 10న చర్చలు
హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగడానికి టీజీఎస్ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతోంది. హైదరాబాద్లోని బస్భవన్లో ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్కు జనవరి 27న సమ్మె నోటీసుతో పాటు 21 డిమాండ్ల పత్రాన్ని కార్మిక సంఘాల నేతలు అందించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఈనెల 10న సాయంత్రం 4గంటలకు చర్చలకు రావాలని ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ జేఏసీకి కార్మిక శాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. సమస్యల పరిష్కారానికి చర్చలకు ఆహ్వానించినట్టు కార్మిక శాఖ పేర్కొంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం. రెండు పీఆర్సీల అమలు. 2021 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు. కండక్టర్లు, డ్రైవర్ల ఉద్యోగ భద్రతపై మార్గదర్శకత్వం. పీఎఫ్, సీసీఎస్ బకాయిల చెల్లింపు. ఆర్టీసీ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హాల అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎలక్ట్రి బస్సులను ప్రభుత్వమే ఆర్టీసీకి కొనుగోలు చేసి ఇవ్వాలి. ఈ-బస్సుల పేరుతో అద్దె వాహనాలను తీసుకొస్తున్నారు. వీటిపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ప్రైవేటు వ్యక్తులకే చెందుతుంది. వీటిని ఆర్టీసీయే తీసుకుని నడపడం వల్ల సబ్సిడీ కూడా ఆర్టీసీకి వొస్తుంది. ఆర్టీసీ అభివృద్ధికి బడ్జెట్లో 3శాతం నిధుల కేటాయించాలి. సంస్థ అప్పులను టేకోవర్ చేయాలి. మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్కు బదులు మహిళలకు స్మార్ట్ కార్డుల పంపిణీ. రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలి. ఆర్టీసీలో ఖాళీలను భర్తీచేయాలి. పదేళ్లుగా ఆర్టీసీలో నియామకాలు లేకపోవడంలో ఉద్యోగులపై పనిభారం పెరిగింది.
సుమారు 16వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా.. వారి పనిని సర్వీసులో ఉన్న ఉద్యోగులే చేయాల్సి వొస్తోంది. పొరుగుసేవల కింద పనిచేస్తున్న విశ్రాంత అధికారులు, సూపర్వైజర్లను తొలగించి పదోన్నతుల ద్వారా ఆయా పోస్టులు భర్తీ చేయాలి. కార్మికులకు 8 గంటల పనిదినాల అమలు, మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల్లోపు విధులు ముగిసేలా చూడాలి.పీఎఫ్కు సంబంధించి ఉద్యోగుల నుంచి రికవరీ చేసిన సుమారు రూ.12 వేల కోట్లను యాజమాన్యం ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్కు పంపించలేదు. వెంటనే ఈ అంశాన్ని పరిష్కరించాలని కోరుతున్నారు.