ఎక్కేకాడ పైలం… దిగేకాడ పైలం…!

 అడుగు పెట్టేందుకు హడలెత్తుతున్నారు
 నత్తనడకన సాగుతున్న నాసిరకం పనులు
 అమృత్‌ కాదు.. అంతా ఆగమాగమే..
 ఏడాది గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!

కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: కొత్తగూడెం రైల్వే స్టేషన్‌(బిడిసిఆర్‌)లోకి ప్రవేశించగానే భద్రం కొడుకో ఎక్కేకాడ…దిగేకాడ… జర పైలం కొడుకో అన్న పాట గుర్తు చేసుకోవల్సిందే అని ప్రయాణికులు అంటున్నారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ నుండి ప్రయాణం అంటే టికెట్టు కొనుక్కుని కోరి ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లే అంట్టున్నారు ప్రజలు. స్టేషన్‌లోకి రావాలంటే ప్యాసింజర్లు హడలెత్తుతున్నారు. స్టేషన్‌ అభివృద్ధి మాటున మరమ్మతుల పేరుతో రైల్వే స్టేషన్‌ను అస్తవ్యస్తంగా మార్చేశారు. పనులు ప్రారంభించి ఏడాది కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది రైల్వే స్టేషన్‌ పరిస్థితి. దేశంలో రైల్వేస్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్‌ భారత్‌ స్టేషన్ల పథకం ప్రారంభించింది.
image.png
ఈ పథకం ద్వారా తెలంగాణ నుంచి మొత్తం 39 స్టేషన్లను అమృత్‌ భారత్‌ పథకంలో చేర్చగా మొదటి విడతగా భద్రాచలం రోడ్‌(కొత్తగూడెం), ఖమ్మం, మధిర, మహబూబాబాద్‌, వరంగల్‌, కాజీపేట జంక్షన్‌, పెద్దపల్లి, రామగుండం ఇలా మరో 13 స్టేషన్లు ఎంపికయ్యాయి. ఈ పథకం ద్వారా ప్రతి రైల్వే స్టేషన్‌ లోపల, పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం, ప్రయాణికుల వెయిటింగ్‌ హాల్స్‌, టాయి లెట్స్‌, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఉచిత వైఫై సదుపాయాలతోపాటు వన్‌ స్టేషన్‌ వన్‌ప్రొడక్ట్‌ దుకాణాలు, ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లు, స్టేషన్‌ ముందు, వెనక భాగాల్లో చిన్న గార్డెన్లు ఏర్పాటుతో ఆధునీకరించాల్సి ఉంది. అయితే భద్రాచలం రోడ్‌(బిడిసిఆర్‌) రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి సుమారు రూ 20 కోట్లు కేటాయించిది రైల్వేశాఖ. అయితే  స్టేషన్‌లో అభివృద్ధి పనులు మాత్రం రెండడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లుగా అభివృది పనులు నత్తనడకన సాగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో పనులను పట్టించుకునే నాదుడే కరువయ్యారు.
image.png
ప్రాణ సంకటంగా ప్రయాణం
స్టేషన్‌ ఆధునీకరణ పనులు ప్రారంభించి సంవత్సరం కావస్తున్నా ప్రవేశ మార్గం పనులు సైతం అసంపూర్తిగా నిలిచి పోయాయి. మరమ్మత్తుల కోసం స్టేషన్‌ రూపు రేఖలే మారిపోడంతో ఇది రైల్వే స్టేషనా ? అన్న అనుమానాలు కలుగక మానవు. దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలం రాములవారిని దర్శించేందుకు దేశం నలు మూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున రైలు మార్గం ద్వారా కొత్తగూడెం వస్తున్నారు. స్టేషలోకి ప్రవేశించే ప్రాంగణంలో ఇసుక, కంకర కుప్పలు దర్శనిమిస్తున్నాయి. రైలు ఎక్కేందుకు స్టేషన్‌లోకి వచ్చేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టికెట్‌ కౌంటర్‌ కూడా అక్కడే ఉండటంతో ఇరుకుగా మారడం ప్రయాణికులకు రైలు ఎక్కడం కష్టతరం అవుతుంది. ఇసుక, మట్టి, కంకర దిబ్బల కారణంగా ప్రయాణికులు జారిపడుతున్న సంఘటనలు లేకపోలేదు. దీంతో స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు సమస్యలు స్వాగం పలుకుతున్నాయి. స్టేషన్‌ ప్రాంగణంలో పనులు సాగడంతో ఎటు చూసినా గుంతలు దర్శనం ఇస్తున్నాయి. రైల్వే ఫ్లాట్‌ఫామ్‌ మీద ఉన్న టైల్స్‌ ఎక్కడికక్కడ ఊడిపోయి, గుంతలు పడ్డాయి. కొన్ని చోట్ల సిమెంటుతో పనులు చేసి అసంపూర్తిగా వదిలేశారు. ఫ్లాట్‌ఫార్మ్‌ అంతా ఎగుడు, దిగుడుగా అధ్వాన్నంగా తయారై  ప్యాసింజర్లు రైళ్ళు ఎక్కే తొందరలో కిందపడి దెబ్బలు తగులుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికులు రైలు ఎక్కే తొందరలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉంటే ఇక ప్రాణాలు రైలు చక్రాల కింద నలిగి పోవాల్సిందే అంటు ఆందోళన చెందుతున్నారు.
image.png
బెర్తు ఉన్నా బోగీ దొరకదు
మరమ్మతుల పేరుతో ఫ్లాట్‌ఫార్మ్‌కు చెందిన విద్యుత్‌ వైర్లను తొలగించారు. విద్యుత్‌ దీపాలు సరిగా లేకపోడంతో రాత్రి వేళల్లో, తెల్లవారుజామున రైళ్ళలో ప్రయాణించేందకు స్టేషన్‌కు మహిళలు, ముఖ్యంగా వృద్ధుల అవస్తలు వర్ణనాతీతం అనే చెప్పాలి. పెద్ద ఎత్తున పనులు జరుగుతున్న నేపధ్యంలో కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోడం అధికారుల, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. స్టేషన్‌లో ఎటువంటి సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయకపోడంతో ప్రయాణికులు అసలు ఎటునుండి లోపలికి ప్రవేశించాలో, బయటికి వెళ్ళాలో తిలియని దుస్థితి నెలకొంది. ఫ్లాట్‌ఫార్మ్‌లలో డిస్‌ప్లే బోడ్రుల విద్యుత్‌ కనెకక్షన్‌లు తొలగించడంతో అవి వెలగడం లేదు. టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు సీటు ఎటు పోతుందిలే అని స్టేషన్‌కు వచ్చి చూసేసరికి తీరా డిస్‌ప్లే బోర్డులు కనిపించక పోడంతో కోచ్‌ ఒక్కడుందో తెలియక ఫ్లాట్‌ఫార్మ్‌ మీద పరుగులు తీయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
దీంతో అమృత్‌ స్టేషన్‌ ఏమోగానీ అయోమయం, గందరగోళంగా తయారైంది బిడిసిఆర్‌ రైల్వే స్టేషన్‌ అంటూ ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు రైలు ఎక్కే సంమయంలో అప్రమత్తంగా లేకపోతే అదే చివరి ప్రయాణంగా మారే ప్రమాదం ఉందంటూ భయాందోళన చెందు తున్నారు. త్వరలో భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రైలు మార్గంగుండా భక్తులు పెద్ద ఎత్తున కొత్తగూడె స్టేషన్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారులు త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా  చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page