తమిళనాడు రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల మూడ్లోకి రావడంతో, రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. అధికారాన్ని నిలుపుకునేందుకు స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే ప్రయత్నాలు చేస్తుంటే, తిరిగి పవర్లోకి వచ్చేందుకు ఏఐడీఎంకే వ్యూహాలకు పదును పెడుతోంది. ఇదే సమయంలో బీజేపీ, హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకేలు కూడా అధికారంపై ఆశలు పెట్టుకొని ఆదిశగా ప్రచారం మొదలుపెట్టాయి. ప్రాంతీయవాదం, భాషా వివాదం ,నీట్ అంశం, వన్ నేషన్ వన్ ఎలక్షన్, దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది అధిపత్యం అంటూ డీఎంకే ప్రభుత్వం కేంద్రంతో రాజకీయ యుద్ధాన్ని కొనసాగిస్తోంది. నిధుల విషయంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నదని, ముఖ్యంగా తమిళ ప్రజలపై బీజేపీ హిందీని బలవంతంగా రుద్దుతున్నదంటూ స్టాలిన్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో డీఎంకే ఈ అంశాలే ప్రధాన అజెండాగా ఎన్నికల బరిలో దిగబోతున్నది. ఇండియా కూటమి దన్ను, కమ్యూనిస్టుల మద్దతు, కమల్ హసన్ సినీ గ్లామర్ అదనపు ఆయుధాలుగా డీఎంకే తన అస్త్ర శ స్త్రాలకు పదును పెడుతూ రానున్న ఎన్నికల పోరాటానికి సమాయత్తమవుతోంది. కమల్ హసన్ను డీఎంకే తరపున రాజ్య సభకు పంపడం వెనుక ఆయన సినీ గ్లామర్ను ఉపయోగించుకునే వ్యూహం వుంది. ఏతావాతా చెప్పాలంటే తమిళనాడులో ద్రవిడవాదం బలంగా వున్నంత వరకు డీఎంకేకు ఎటువంటి ఢోకా వుండదనేని సుస్పష్టం.
ద్రవిడవాద పార్టీలు బలోపేతమయ్యాక, తమిళనాడులో జాతీయ పార్టీలకు స్థానం లేకుండా పోయింది. కాంగ్రెస్, డీఎంకేకు తోకలాగా మారిన దుస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ తమిళనాడులో పాగా వేయడానికి చమటోడుస్తున్నదనే చెప్పాలి. ఉత్తరాదిలో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ప్రస్తుతం దక్షిణాదిపై దృష్టి పెట్టింది. ఈసారి తమిళనాడులో తన ఓటింగ్శాతాన్ని, క్షేత్రస్థాయిలో తన బలాన్ని మరింత పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ద్రవిడ వాదాన్ని, సనాతన వాదంతో ఎదుర్కొం టున్న తీరు, రాష్ట్రంలోని సనాతన వాద మద్దతుదారులను ఆకర్షిస్తోంది. పూర్తిగా ద్రవిడవాదం పై ఆధారపడి మనుగడ సాగిస్తున్న స్టాలిన్ కాషాయ పార్టీకి తనదైన శైలిలో గట్టిగా సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్షాలు రాష్ట్రంలో చాపకింద నీరులా నిశ్శబ్దంగా విస్తరించే వ్యూహాలను అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బలమైన ప్రాంతీయ అస్థిత్వ పునాదులపై నిర్మితమైన డీఎంకేను బలహీనర్చేందుకు సినీ హీరో విజయ్ను కమలనాథులు రంగంలోకి దింపారన్న చర్చ తమిళ తంబిల్లో ఉంది. ఆయనతో పార్టీ పెట్టించి ఎన్నికల్లో పొత్తుతో అధికార పీఠానికి దగ్గరయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చలు ఊపందుకోవడంతో, చెన్నపట్నంలో రాజకీయ ఉక్కపోత పెరిగిపోయింది.
ప్రాంతీయ పార్టీలను బలహీనపరచి రాజకీయంగా లబ్దిపొందడం బీజేపీ మొదటి నుంచి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడంకోసం ముందుగా వాటితో పొత్తులు పెట్టుకొని తర్వాత దొడ్డి దారిలో ఎంట్రీ ఇచ్చి గద్దెనెక్కడం కమలనాధులు అనుసరించే వ్యూహం. బీజేపీ ఇప్పుడు తమిళనాడులో కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుంటంతో అమిత్ షా తమ రోడ్ మ్యాప్ను సిద్దం చేసుకుని వేగంగా అమలుచేస్తున్నారు. నిజం చెప్పాలంటే బీజేపీ రాజకీయాలు ఎంతో గతిశీలకంగా వుంటాయి. శత్రువుకు శత్రువు తమ మిత్రుడనే వ్యూహాన్ని బీజేపీ అమలుచేస్తుంటుంది.అధికారం కోసం గొంగడి పురుగును సైతం ముద్దాడుతుంది. చిన్నా పెద్దా పార్టీలు అన్న తేడాలు చూడకుండా అన్ని పార్టీలతో అంటకాగే లక్షణం వల్ల అన్ని రాష్ట్రాల్లో బీజేపీ తన బలమైన ముద్ర వేస్తూ ముందుకు సాగడమే కాదు, ప్రజల్లోకి చొచ్చుకు పోతున్నది. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో కాషాయ పార్టీ వ్యూహాలు విజయవంతమయ్యాయి. ఒక్క తమిళనాడులో మాత్రమే దాని వ్యూహాలు పని చేయడం లేదు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా, ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేసినా తమిళులు బీజేపీని ఆదరించడం లేదు. ఫలితంగా బీజేపీకి తమిళనాడులో ఎప్పుడూ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. తమ అస్థిత్వంపై దెబ్బకొట్టాలన్న జాతీయ పార్టీల కుట్రలను తమిళ ప్రజలు తిప్పికొడుతూనే వున్నారు.
ప్రాంతీయ పార్టీలను బలహీనపరచి రాజకీయంగా లబ్దిపొందడం బీజేపీ మొదటి నుంచి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడంకోసం ముందుగా వాటితో పొత్తులు పెట్టుకొని తర్వాత దొడ్డి దారిలో ఎంట్రీ ఇచ్చి గద్దెనెక్కడం కమలనాధులు అనుసరించే వ్యూహం. బీజేపీ ఇప్పుడు తమిళనాడులో కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుంటంతో అమిత్ షా తమ రోడ్ మ్యాప్ను సిద్దం చేసుకుని వేగంగా అమలుచేస్తున్నారు. నిజం చెప్పాలంటే బీజేపీ రాజకీయాలు ఎంతో గతిశీలకంగా వుంటాయి. శత్రువుకు శత్రువు తమ మిత్రుడనే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తుంటుంది.అధికారం కోసం గొంగడి పురుగును సైతం ముద్దాడుతుంది. చిన్నా పెద్దా పార్టీలు అన్న తేడాలు చూడకుండా అన్ని పార్టీలతో అంటకాగే లక్షణం వల్ల అన్ని రాష్ట్రాల్లో బీజేపీ తన బలమైన ముద్ర వేస్తూ ముందుకు సాగడమే కాదు, ప్రజల్లోకి చొచ్చుకు పోతున్నది…
రాజకీయంగా తమిళ పార్టీల మధ్య ఎన్ని విభేదాలు, వైరుధ్యాలున్న, రాష్ట్రం విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా అందురూ ఏకమవుతారు. తమ హక్కులు సాధించుకునేందుకు, అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు, కేంద్రం మెడలు వంచడానికి అన్ని పార్టీలు ఏకతాటిపైకి వస్తాయి. అసాధ్యమనుకున్న చోటల్లా తమ వ్యూహాలతో గెలుపును సుసాధ్యం చేసే బీజేపీకి తమిళనాడు ఒక సవాల్గా మారిందనే చెప్పాలి. ఎన్ని రకాల వ్యూహాలు అమలు చేసిన తంబిల ముందు అవి పని చేయడం లేదు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కనీసం డిపాజిట్లు దక్కడం లేదంటే కాషాయ పార్టీని తమిళులు ఎంతలా వ్యతిరేకిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దీన్ని అధిగమించేందుకు ఈసారి బీజేపీ సినీ గ్లామర్ను ఉపయోగించుకోవాలని చూస్తున్నది. ఇందుకోసం సినీ హీరో విజయ్ని రంగంలోకి దించిందన్న వార్తలు తమిళనాడులో జోరందుకున్నాయి. అంతకుముందు డీఎంకేను టార్గెట్ చేసేందుకు బీజేపీ ఏఐడీఎంకేతో దోస్తీ కట్టింది.జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో బలం పుంజుకునే ప్రయత్నం చేసింది. కానీ జయ మరణాంతరం ఏఐడీఎంకే కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. బీజేపీ తన రాజకీయ వ్యూహాలతో ఏఐడీఎంకేను నిర్వీర్యం చేసింది.అక్రమాస్తుల కేసులో శశికళను జైలుకు పంపింది.దినకర్ను రాజకీయ సమాధి చేసింది.ఏఐడీఎంకే ప్రభుత్వంలో జూనియర్ పార్ట్నర్గా చేరి ప్రభుత్వంలో చిచ్చు పెట్టింది.పళనిస్వామి, పన్నీర్ సెల్వన్ల మధ్య విభేదాలు సృష్టించింది చివరకు ఎంతో బలమైన పార్టీగా నిలిచిన ఏఐడీఎంకే కనుమరుగయ్యేలా బీజేపీ కుట్రలు చేసింది.
ప్రస్తుతం ఆ వారసత్వానికి చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను కొట్టేందుకు సిద్దమవుతోంది.అందుకోసం కాషాయ నేతలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఒక వైపు డీఎంకేను నేరుగా టార్గెట్ చేస్తునే మరోవైపు తన మిత్ర పార్టీలతో పథక రచన చేస్తున్నారు. సినీ హీరో విజయ్ను రంగంలోకి దించడం ఇందులో భాగమేనన్న చర్చ తమిళనాడులో జరుగుతున్నది. నిజానికి తమిళనాడులో విస్తరించేందుకు కమలనాథులు చేయని ప్రయత్నం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని బలహీనపరచేందుకు ప్రతిపక్షంతో జత కట్టింది. డీఎంకే అధికారంలో ఉంటే ఏఐడీఎంకేతో, జయలలిత అధికారంలో కరుణానిధితో బీజేపీ జత కట్టింది.అంతేకాదు డీఎంకే, ఏఐడీఎంకేతో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అనేక సందర్భాల్లో పొత్తులు పెట్టుకున్నాయి. రాష్ట్రంలో జయలలిత, కరుణానిధిలు నువ్వా నేనా అన్నట్లు ఎప్పుడు ఉప్పు నిప్పులా రాజకీయ శత్రువులుగా కొనసాగినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ద్రవిడ పార్టీలు ఎప్పుడూ రాజీపడింది లేదు .తమిళుల హక్కులను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టలేదు.అవసరమైతే తమిళులు తమ హక్కుల కోసం పార్టీలకతీతంగా కేంద్రంతో పోరాటం చేశారు తప్ప రాజీపడిన దాఖలాలు లేవు.
తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకేలను నిర్వీర్యం చేయాలన్న బీజేపీ కుట్రలకు ఏఐడీఎంకే బలైంది. డీఎంకే మాత్రం మరింత బలోపేతమైంది. స్టాలిన్ బలమైన నేతగా నిలిచారు. తమిళుల హక్కులను కాపాడేది ఒక్క డీఎంకే మాత్రమే అన్న బలమైన ముద్ర ప్రజల్లో వేయగలిగారు. అయితే ఏఐడీఎంకేను బలహీనపరచిన బీజేపీ ఇప్పుడు విజయత్ టివీకే పార్టీతో డీఎంకేను టార్గెట్ చేస్తున్నది. తమిళనాడు రాజకీయాలపై సినిమా గ్లామర్ ప్రభావం అధికమని అక్కడి రాజకీయాలు పరిశీలించేవారు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. సినిమా రంగం నుంచి వచ్చిన చాలా మంది పార్టీలు పెట్టి సక్సెస్ అయ్యారు.సీఎంలు అయ్యారు.తంబిలకు ఆరాధ్యులయ్యారు. అదే సమయంలో రాజకీయంగా స్పష్టమైన అజెండా, సిద్ధాంతం లేకపోవడంతో విజయ్ కాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు రాజకీయంగా విఫలం కావడం వర్తమాన చరిత్ర. కరుణానిధి, జయలలిత వంటి ఉద్దండులు చూపించినంత ప్రభావం తమిళ రాజకీయాలపై విజయ్ కాంత్, కమల్ హాసన్ చూపించలేకపోయారన్నది అక్షరసత్యం. సిద్దాంత పరంగా కానీ, కుల మత రాజకీయాలతోగానీ తమిళనాడులో అధికారంలోకి రావడం అసాధ్యమని గ్రహించిన కమలనాధులు ఇప్పుడు సినీగ్లామర్ను నమ్ముకున్నారు. గతంలో సూపర్స్టార్ రజనీకాంత్ను రంగంలోకి దించాలనుకున్నా సాధ్యంకాలేదు.
ఏపీ రాజకీయాల్లో పవన్ పోషించిన పాత్రనే తమిళనాడులో విజయ్ పోషించనున్నారని తమిళులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఆంధ్రలో కాంగ్రెస్ను సమాధి చేసినట్లే, తమిళనాడ్లో ఏఐడీఎంకేను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నదన్న చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ టీవీకే పార్టీని కమలనాథులు ఎరగా వారుడుకుంటున్నారన్న వాదన లేకపోలేదు. బీజేపీ రహస్య రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ను రంగంలో దింపి విజయ్ను నడిపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. విజయ్ టీవీకే పార్టీ ఏర్పాటు అనేక నాటకీయ పరిణామాల మధ్య పురుడు పోసుకుంది. తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు నడుమ టీవీకే నిర్మాణం జరిగింది.అయితే మొదట్లో తమిళుల ఆత్మగౌరవం పునాదులుగా ఏర్పాటయినా, క్రమంగా అది తమిళనాడు బీజేపీ పార్టీ అనుబంధ పార్టీగా మారిందన్న ఆరోపణలున్నాయి. డీఎంకేను టార్గెట్ చేసేందుకు విజయ్ మోదీ, షాలు వదిలిన బాణం అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.ఇప్పటీకే విజయ్ టీవీకే పార్టీకి స్పష్టమై ఎజెండా లేదు.సిద్దాంతం లేదు, టీవీకే కర్త కర్మ క్రియ అంతా అమిత్ షా, ప్రశాంత్ కిషోర్లన్నది టీవీకే మహానాడులో విజయ్ మాట్లాడి తీరును బట్టి స్పష్టంగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా విజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు.శత్రువులు మిత్రులు కావచ్చు మిత్రులు శత్రువులు కావచ్చని బీజేపీకి అనుకూలంగా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. టీవీకే బీజేపీ వదిలిన బాణమని చెప్పకనే విజయ్ చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలో భాషా ఉద్యమం, ఆస్థిత్వ పోరాటం బలంగా వుంది. డిలిమిటెషన్, నీట్తో తమిళనాడుకు కేంద్రం ద్రోహం చేస్తూ హిందీ భాష అమలు పేరుతో బీజేపీ ఆధిపత్యం చేలాయించాలని కుట్రలు చేస్తుంటే, దాన్ని వ్యతిరేకించకుండా, బీజేపీ కుట్రలను ఎండగడుతున్న డీఎంకేను విజయ్ టార్గెట్ చేయడం, డీఎంకే పై విమర్శలు, ఏఐడీఎంకే, బీజేపీపై సానుకూల వ్యాఖ్యలు చేయడం తమిళ రాజకీయాల్లో చర్చ నీయంశంగా మారింది. అసలు టీవీకే పార్టీ అజెండా ఎంటన్న చర్చ తంబిల్లో మొదలైంది. దళపతి దారెటంలూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు..టీవీకే ఎన్నికల వ్యూహమేంటి? విజయ్ పార్టీది జాతీయ అజెండానా ప్రాంతీయవాదమా? అని వోటర్లలో చర్చ జోరందుకుంది. బీజేపీ, కాంగ్రెస్ విషయంలో టీవీకే స్టాండ్ ఏంటనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అంతేకాదు డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలపై అనుసరించే విధానమేంటని విజయ్ను నిలదీస్తున్నారు.
హిందీ భాష, డీలిమిటేషన్, నీట్పై టీవీకే స్టాండ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేస్తూ దేశంలో రాష్ట్రాల హక్కులను హరిస్తూ కుల మత రాజకీయాలు ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దే బీజేపీని తిరుగులేని రాజకీయ శక్తిగా మారుస్తున్న సీక్రెట్ ఎజెంట్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ను టీవీకే ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకోవడంపై తంబిలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో డీఎంకేకు కూడా ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా ఉన్నప్పటికీ డీఎంకే రాష్ట్ర హక్కుల విషయంలో ఎప్పుడూ కేంద్రంతో రాజీపడలేదు. ఇప్పుడు విజయ్ అలాంటి బలమైన స్టాండ్ తీసుకుంటారా అన్న చర్చ జరుగుతున్నది. ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహానికి దూరంగా ఉంటానని, ఇక నుంచి ఎవ్వరికీ వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించి సొంతపార్టీ పెట్టుకుని బీహార్లో రాజకీయంగా కొత్త ప్రయాణం మొదలు పెట్టిన పొలిటికల్ ఈవెంట్ మేనేజర్ ఇప్పుడు తమిళనాడులో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి అందులోనూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్న టీవీకేకు వ్యూహకర్తగా పని చేయడం తంబిల్లో ఆందోళన కలిగిస్తున్నది. తన పార్టీని కూడా పక్కనబెట్టి టివీకేకు ఎందుకు వ్యూహకర్తగా మారాడన్న అనుమానాలను తంబీలు వ్యక్తం చేస్తున్నారు.
ఏఐడీఎంకే , టీవికే, బీజేపీల టార్గెట్ డీఎంకే అన్న విషయంపై తమిళ ప్రజలకు స్పష్టత వచ్చింది. ఏపీలో సినీ గ్లామర్ సక్సెస్ మంత్రాన్ని తమిళనాడులో కాషాయ పార్టీ అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిశోర్ ను బీజేపీ రంగంలోకి దింపింది. తనకు ఒంటరిగా సాధ్యం కానిది టీవీకేతో కలిసి చేయాలని బీజేపీ చూస్తున్నది. టీవీకే భుజాలపై కత్తిపెట్టి కమలనాథులు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిగా బలహీనపడి బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చిన ఏఐడీఎంకే ఓట్ షేర్ డీఎంకేకు ఇండియా కూటమికి మళ్లకుండా టీవీకే సహాయంతో తనవైపు తిప్పుకునేందుకు కాషాయపార్టీ ప్రయత్నిస్తోంది. అయితే టీవీకే అధ్యక్షుడు విజయ్ను తమిళ తంబిలు ఆదరిస్తారా? లేదా అనేది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుస్తుంది. ప్రాంతీయవాదం, ఆస్థిత్వ వాదం, బలమైన సాంస్కృతిక పునాదుల బలం లేకుండా టీవీకే సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.రజనీకాంత్ను రాజకీయంగా వాడుకునే విషయంలో విఫలం అయిన బీజేపీ విజయ్ విషయంలో సక్సెస్ అయింది.అయితే అది అధికారాన్ని దగ్గరకు చేస్తుందా? కాషాయ పార్టీ దీర్ఘకాలిక వ్యూహాలు ఫలిస్తాయా? డీఎంకే, ఏఐడీఎంకేల మధ్య అధికార మార్పిడి వారసత్వానికి తమిళ ప్రజలు ముగింపు పలికి కొత్త పార్టీకి పట్టం కడతారా అన్నతి తెలియాలంటే వొచ్చే ఏడాది వరకూ వేచి చూడాల్సిందే.
(తోటకూర రమేష్)