– గురుకులాల అప్గ్రేడ్తో పేద విద్యార్థులకు ప్రయోజనం
– ఆ స్కూళ్లనుంచి డాక్టర్లు, ఇంజినీర్లు తయారవుతున్నారు
– విద్యార్థులు సమాజానికి మేలు చేయాలి
– మాజీ మంత్రి హరీష్రావు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారని, ఇది కేసీఆర్ దూరదృష్టికి ఫలితమని మాజీ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధన గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసం వల్ల సాధ్యమైందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం భూచనల్లి ప్రభుత్వ మైనారిటీ గురుకులం ప్రారంభం సందర్భంగా ఫ్యూచర్లో ఏం అవుతావు అమ్మా అని అడిగిన ప్రశ్నకు డాక్టర్ అవుతాను అని ఫిర్దోస్ అనే విద్యార్థిని చెప్పింది. చెప్పడమే కాదు.. కష్టపడి చదివి నేడు ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు.. జహీరాబాద్ నియోజకవర్గంలోని అదే మైనారిటీ గురుకులం నుండి మరో ఎనిమిదిమంది విద్యార్థినులు, అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి ఏడుగురు విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఈ సందర్భంగా ఫిర్దోస్ను మాజీ మంత్రి హరీష్రావు అభినందించారు. ’తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాకముందు మొత్తం 290 గురుకులాలు ఉండగా కేసీఆర్ ప్రభుత్వం వాటిని 1020కి పెంచింది.. నాడు కేవలం రెండు మైనారిటీ గురుకులాలు ఉంటే ఆ సంఖ్యను 204కు పెంచింది.. గతంలో ఇంటర్ చదువు గురుకులాల్లో అందుబాటులో ఉండేది కాదు.. పది తరగతి పూర్తి చేసిన తర్వాత పేద విద్యార్థులు పనులకు వెళ్లేవారు.. దీన్ని మార్చడానికి కేసీఆర్ అన్ని గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసి ఉన్నత విద్యను చేరువ చేశారు.. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయడం ముఖ్యంగా యువతులకు ఒకప్పుడు ఎంతో కష్టం.. దీనికి పరిష్కారంగా కేసీఆర్ 30 డిగ్రీ కాలేజీలను ప్రత్యేకంగా ప్రారంభించారు.. దేశంలో తొలిసారిగా రెసిడెన్షియల్ లా కాలేజీని కూడా ప్రభుత్వం ప్రారంభించి దేశానికి ఆదర్శంగా నిలిచింది’ అని హరీష్రావు వివరించారు. పేద పిల్లల విద్యపై పెట్టుబడి కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగమని కేసీఆర్ నమ్మారన్నారు. విద్యార్థుల కోసం చేసే ఖర్చును కేపిటల్ ఎక్స్పెండిచర్గా నిర్వచించారని తెలిపారు. ఒక పేద ఇంట్లో ఒక ఇంజినీర్ లేదా ఒక డాక్టర్ చదివే అవకాశం రావడం గొప్ప విషయమని, వారి వల్ల ఆ కుటుంబం మాత్రమే కాక ఒక తరం మొత్తంలో మార్పు వస్తుందని కేసీఆర్ నమ్మారు.. కాబట్టి విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించి చదువుకునే అద్భుత అవకాశాలు అందించారని హరీష్రావు తెలిపారు. మీరు మంచి స్థాయికి చేరుకుని తిరిగి సమాజానికి ఇవ్వాలని, మీ ఊరికి, మీ స్నేహితులకు, పేదలకు, గురుకుల సొసైటీకి ఏదో విధంగా తోడ్పాటు అందించాలని విద్యార్థులకు హరీష్రావు పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





