ఇద్దరు మహిళా నక్సల్స్ మృతి
భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 26 : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ్పూర్ జిల్లాలోని అబుజ్మద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య గురువారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిబళా మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం వద్ద 315 బోర్ రైఫిల్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కోకమెట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కోకమెట ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని, ఈ సమాచారం ఆధారంగా నారాయణపూర్ నుండి డీఆర్జి, కొండగావ్ నుండి ఎస్టీఎఫ్ సిబ్బందిని నక్సల్ ఆపరేషన్ కోసం పంపామని పోలీసు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి పోలీస్ బలగాలు మావోయిస్టులు సమావేశమైన ప్రదేశానికి చేరుకున్న సమయంలో మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారన్నారు. ఉదయం బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినప్పుడు ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.



