నీటి కేటాయింపులపై కేఆర్ఎంబీ కీలక సూచనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మొదట తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని కేఆర్ఎంబీ సూచించింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నీటిని వాడుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు తెలిపింది. గురువారం హైదరాబాద్ లోని జలసౌధలో జరిగిన సమావేశంలో కేఆర్ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ , ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ లో ఉన్న నీటిపై చర్చ జరగగా.. తమకు 63 టీఎంసీలు కావాలని తెలంగాణ, 55 టీఎంసీలు కావాలని ఏపీ కేఆర్ఎంబీకి రెండు రాష్ట్రాలు వివరాలు సమర్పించాయి. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని బోర్డు సూచించింది. తాగు నీటికి ప్రాధాన్యం ఇస్తూ.. మిగిలినది పంటలకు వాడుకోవాలని తెలిపింది. 15 రోజులకు ఒకసారి నీటి మట్టం పరిస్థితులను సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని రెండు రాష్ట్రాలకు బోర్డు సూచించింది.