- ఆలయానికి పోటెత్తిన భక్తులు
- భద్రకాళిని దర్శించుకున్న తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి
వరంగల్, ప్రజాతంత్ర, ఆక్టోబర్ 4 : వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రులు రెండో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం గంటలు 04 గంటలకు నిత్యహ్నికం నిర్వర్తించిన అనంతరం అర్చకులు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించారు. అమ్మవారికి ఉదయం బ్రహ్మచారిణి, సాయంకాలం దేవజా దుర్గా క్రమాలలో పూజారాధనలు జరిపారు. ఉదయం మకర వాహన సేవ సాయంకాలం చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు.
నవదుర్గా క్రమంలోని బ్రహ్మచారిణి దుర్గా క్రమంలో ఆరాధింపబడిన అమ్మవారు సాధకుల దృష్టిని శరీరంలోని స్వాదిస్టాన చక్రంమీద కేంద్రీకరింపజేసి సాధకుడిని విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులను చేసి అధికారం, జ్ఞానం రెండింటిని ప్రసాదిస్తుంది. దేవజా దుర్గా ఈమె సమస్త దేవతా కోపసంభూత, సాధకుడిని భాదిస్తున్న అసూరీ శక్తులను దునిమి పారేస్తుంది.మకర వాహనం మీద అమ్మవారిని గంగాభవానిగా, చంద్రప్రభ వాహనం మీద అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరించారు. మకర వాహనం మీద గంగాభవానిగా అమ్మవారిని దర్శించడం వల్ల జల గండాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం.
అన్నపూర్ణేశ్వరి అలంకారంలో వున్న అమ్మవారిని దర్శించడం వల్ల ఆకలి బాధలు దరిచేరవు, కాగా శుక్రవారం నాటి పూజా కార్యక్రమాలకు ప్రయోజకులుగా డాక్టర్ పోతాని రాజేశ్వర ప్రసాద్- డాక్టర్ లలితాదేవి దంపతులు, సూర్యకుటీర్ అధినేతలు తంగళ్ళపల్లి తిరుమలదేవి సంపత్ కుమార్, హర్షవర్ధన్-డాక్టర్ మానస, కుమారి వైష్ణవి, నూకల శ్రీనివాస్ రెడ్డి –శైలజ దంపతులు, అభిషేక్ రెడ్డి, నీలారెడ్డి, బాలచంద్ర హోళ్ళ-రేణుఖ దంపతులు, చంద్రశేఖర శెట్టి-జ్యోతి దంపతులు, కొప్ప నాగరాజా శెట్టి-ప్రభావతీ దంపతులు, అన్నపశెట్టి-హేమ దంపతులు, సందీప్ శెట్టి- నమ్రత దంపతులు, నాగభూషణం- శ్రీదేవి దంపతులు తదితరులు వ్యవహరించారు.
తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారు దేవాలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన స్వామి వారికి దేవాలయ కార్యనిర్వాహణాధికారి శేషుభారతి, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషులు పూర్ణకుంభం, మంగళ వాద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. మాధవానంద సరస్వతి స్వామి అమ్మవారి పూజనంతరం దేవాలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి తమ అనుగ్రహ భాషణం చేశారు. మాజీ ఎంఎల్ఏలు దాస్యం వినయభాస్కర్, నన్నపూనేని నరేందర్ లు దర్శించుకున్నారు. సాయంకాలం నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హరికథ, భక్తి సంగీతం, కర్నాటక సంగీతం, కూచిపూడి నృత్యాలు భక్తులను ఎంతగానో అలరించాయి.