- కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలకు నిరసనగా… కేంద్ర కార్మిక సంఘాల పిలుపు
- శని, ఆదివారాలతో పాటు రెండ్రోజలు సమ్మె…బ్యాంకులకు నాలుగు రోజుల వరుస సెలవులు
న్యూ దిల్లీ, మార్చి 24 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ సమ్మెలో రవాణా, విద్యుత్తు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్..ఇలా అన్ని రంగాల కార్మికులు పాల్గొంటారని వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గించిందని, ఇంధన ధరలను ఎడాపెడా పెంచుతున్నదని కార్మిక సంఘాలు విమర్శించాయి. దీని ప్రభావం సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులపై అధికంగా పడుతున్నదని పేర్కొన్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు విద్యుత్తు రంగ ఉద్యోగులు ప్రకటించారు. విద్యుత్తు ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.
శని, ఆదివారాలతో పాటు రెండ్రోజులు సమ్మె… బ్యాంకులకు నాలుగు రోజుల వరుస సెలవులు
బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 28, 29 తేదీల్లో దేశ వ్యాప్త సమ్మెకు పలు బ్యాంకు యూనియన్లు పిలుపునిచ్చాయి. తీంతో ఈ వారంలో 26న నాలుగో శనివారం, 27న ఆదివారంతో కలిపి వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కావచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ సమ్మె జరుగుతుంది. ఎస్బీఐ తమ శాఖలు, కార్యాలయాల్లో పనులను సాధారణీకరించేందుకు ప్రయత్నిస్తామని, అయితే సమ్మె కారణంగా ఇక్కడి పనులపై కొంత మేర ప్రభావం పడవచ్చని పేర్కొంది. బ్యాంకులు సమ్మెలో ఉన్నప్పుడు ఖాతాదారులకు బ్యాంకు బ్రాంచ్లో లభించే సేవలకు అంతరాయం కలుగుతుంది. అయితే డిజిటల్ పద్ధతిలో బ్యాంకింగ్ లావాదేవీలు చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాకింగ్, యూపీఐ, నెప్ట్, ఆర్టీజీఎస్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా లావాదేవీలు జరుపుకునే వీలుంది.