మెదక్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డి మంత్రి హరీష్ రావు సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఆయనతో పాటు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు చేరడంతో మంత్రి హరీష్ రావు వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..డబ్బుతో మెదక్ ప్రజల ఆత్మగౌరవం కొనలేరని, మెదక్ అడ్డాలో డబ్బు సంచులు పని చేయవని అన్నారు. ప్రజల మీద ప్రేమ ఉండాలి…ప్రజలకు సేవ చేయాలన్నారు. మెదక్లో పుకార్లు తిప్పికొట్టాలని, బీఆర్ఎస్కు హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేగా పద్మ ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఇందిరాగాంధీ మాట తప్పారు కానీ సీఎం కేసీఆర్ వల్ల, పద్మ వల్ల మెదక్ జిల్లా అయిందన్నారు. మెదక్కు మెడికల్ కాలేజీ వొచ్చిందని, రైల్ వొచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఘన్పూర్ ఆనకట్ట నీళ్ళు వదలాలని ధర్నాలు చేసే రోజులు ఇప్పు లేవని, రెండు పంటలకు నీళ్ళు ఇస్తున్నది, కరెంట్ నిరంతరం ఇస్తున్నది కెసీఆర్ అన్నారు. పండుగల వేళ ఎన్నికల పండగ వొచ్చిందని, రకరకాల వ్యక్తులు వొస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హరీష్ రావు సూచించారు. దండగ అన్న వ్యవసాయం పండగ చేసింది కేసీఆర్ అని మంత్రి అన్నారు. నాడు రూపాయి పెట్టుబడి లేని పరిస్థితి అని, ఇప్పుడు పెట్టుబడి సాయం ఇస్తున్నామని అన్నారు. ఉచిత కరెంట్ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడని, 3 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా..24 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా..అని హరీష్ రావు ప్రశ్నించారు.
ఎండాకాలంలో కూడా పంటకు నీళ్ళు అందుతున్నాయని, గుంట కూడా ఎండటం లేదని అన్నారు. కంటి వెలుగుతో ప్రతి ఇంట్లో వెలుగు నింపిందని, కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, కిసాన్ సమ్మాన్ నిధి, హర్ ఘర్ జల్, కల్యాణ లక్ష్మి, మూగ జీవాలకు అంబులెన్స్. కేంద్రం మన పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తున్నదన్నారు. నాడు బెంగాల్ ఆదర్శంగా ఉండేదని, నేడు తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరించే పరిస్థితి నెలకొందన్నారు. మళ్లీ పద్మ గెలుపు, మెదక్ అభివృద్ధికి మలుపు అన్నారు. జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గెలుపు కోసం అందరం కృషి చేయాలని మంత్రి హరీష్ రావు కార్యకర్తలను కోరారు.