- ప్రజలు కోవిడ్ నిబంధలు పాఠించాలి
- మాస్క్లు తప్పకుండా ధరించాలి
- కొరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
- లక్షణాలుంటే వెంటనే టెస్ట్లు చేయాలని వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : ప్రపంచ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్నాయి..అమెరికాలో రోజుకు లక్ష కేసులు, ఉత్తర కొరియాలో రోజుకు 80 వేలు, జర్మనీలో రోజుకు 50 వేల కేసులు నమోదవుతున్నాయి..అని పేర్కొంటూ కొరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. శనివారం కోటిలోని టీఎస్ఎంఐడీసీ కార్యాలయంలో, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రపంచంలో 75 శాతం పాజిటివిటీ రేటు పెరిగింది. దేశంలో 21 వేల 55 కేసులు గత వారం నమోదయ్యాయి. నిన్న నాలుగు వేల కేసులు దేశవ్యాప్తంగా నమోదయన్నారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో కొరోనా కేసులు పెరుగుతున్నయి. మహారాష్ట్ర, తమిళనాడులో కేసులు రెట్టింపు అవుతున్నయి. తెలంగాణలో పాజిటివీటీ రేటు పెద్దగా లేదు. చివరి వారంలో మన రాష్ట్రంలో కొరోనా కేసులు పాయింట్ నాలుగు శాతం(280 కేసులు) మాత్రమే. ఈ వారం పాయింట్ ఐదు శాతం(375 కేసులు) ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కేసుల తీవ్రత చాలా తక్కువని తెలిపారు. ఈ క్రమంలో మన రాష్ట్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొరోనా మన రాష్ట్రంలో నియంత్రణలోనే ఉంది. కాని అలసత్వంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఉండకూడదు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఎదుర్కునడానికి సిద్దంగా ఉంది.
వైద్య ఆరోగ్య శాఖ అందకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని హరీష్ రావు సూచించారు. కోవిడ్ నిబంధనలను ప్రజలు ఆచరించాలని, మాస్క్లు తప్పనిసరిగా పెట్టుకోవాలని, గుంపులు, గుంపులుగా తిరగవద్దని, వ్యాధి లక్షణాలు ఉంటే పీహెచ్సీలు, బస్తీ దవాఖానాలతో సహా అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఖచ్చితంగా కొరోనా పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసారు. వ్యాధి లక్షణాలు ఉంటే ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ప్రజలు ప్రభుత్వ దవాఖానాల్లో కొరోనా టెస్ట్లు చేయించుకోవాలని, అవసరమైన మందులు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ దవాఖానాల్లో కొరొనా టెస్ట్లు, మందులు, టీకా ఉచితంగానే ఇస్తారు.. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలుపుతూ టెస్ట్, ట్రీట్మెంట్, వాక్సినేషన్ పక్కాగా జరిగేలా వైద్య ఆరోగ్య సిబ్బంది పని చేయాలని, ఇప్పటి వరకు కొరోనాను నియంత్రించడంలో చాలా బాగా పని చేశారని, అదే స్పూర్తితో ఈ సారి కూడా అప్రమత్రంగా పని చేద్దామని, ప్రజల ప్రాణాలు కాపాడుదామని మంత్రి హరీష్ రావు తెలిపారు. పీహెచ్సీ నుండి బోధనా హాస్పిటల్స్ వరకు అన్ని కోవిడ్ చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా సంసిద్దంగా ఉందని, మీరు చేయాల్సిందల్లా మాస్క్లు పెట్టుకోవడం, కోవిడ్ నిబంధనలు పాఠించడమేనని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో ఫస్ట్ డోస్ వంద శాతం పూర్తయిందని, సెకండ్ డోస్ టీకా రాష్ట్రంలో 99 శాతం పూర్తయిందని, 33 లక్షల డోస్ల టీకాలు సిద్ధంగా ఉన్నాయని తెలుపారు. పిల్లలకు 12 నుండి 14 సంవత్సరాల వారికి టీకా ఫస్ట్ డోస్ 89 శాతం పూర్తయిందని..సెకండ్ డోస్ 52 శాతం..15 నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న వారికి ఫస్ట్ డోస్ 92 శాతం.. రెండో డోస్ 80 శాతం పూర్తయిందని తెలిపారు. అరవై ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ 16.8 శాతం వేశాం అని తెలుపుతూ..ఇంకా వేసుకోని వారిని గుర్తించి పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని, బూస్టర్ డోస్ అవసరమైన వారిని గుర్తించి బూస్టర్ డోస్ వేయా•ని పేర్కొన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వాక్సినేషన్ వేసుకోని వాళ్లను ఆరోగ్య కార్యకర్తలు గుర్తించి వారందరికీ ఇంటింటికి వెళ్లి వాక్సినేషన్ చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశాలను జారీ చేసారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, టీఎస్ ఎం ఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, హెల్డ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ శ్వేతా మహంతి, డీహెచ్ శ్రీనివాస్ రావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డీఎంఈ రమేష్ రెడ్డి, వాక్సినేషన్ ఇన్ చార్జి సుధీర్ రావు పాల్గొన్నారు.



