Tల్యాండ్ పూలింగ్తో భూముల కాజేత
కెసిఆర్ తీరుపై మండిపడ్డ బిజెపి ఎమ్మెల్యే ఈట
లజనగామ, ప్రజాతంత్ర, మే 12 : రాష్ట్రంలో ల్యాండ్ ఫూలింగ్ పేరుతో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు అప్పనంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. పేదలకు దక్కాల్సిన అసైన్డ్, అటవీశాఖ భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సిద్ధమవుతుందని ఆరోపించారు. దళితుల మూడు ఎకరాల భూపంపిణీలో విఫలమైన ప్రభుత్వం పిచ్చిపిచ్చి పథకాలతో ప్రజలను వంచించడం సమంజసం కాదన్నారు. తెలంగాణ ప్రజలు విచక్షణతో ఆలోచించి ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలన్నారు.
ల్యాండ్ పూలింగ్ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మద్యం పాలసీతో రాష్ట్రంలో వేలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బీజేపీ అండగా నిలిచి పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ఈ నెల 14న హైదరాబాద్లో జరిగే బీజేపీ బహిరంగ సభతో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దుష్టపాలన అంతానికి శ్రీకారం జరుగుతుందని, జిల్లా నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, భవిష్యత్తు లేదని అర్థమై ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. సింగరేణిలో 63 వేల ఉద్యోగుల నుంచి 43 వేల ఉద్యోగులకు తగ్గారన్నారు.
అయినా ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారని ఆయన తెలిపారు. 3500 కోట్ల మిగులుతో ఉన్న సింగరేణి, రూ.8 వేల కోట్ల అప్పుల పాలైందన్నారు. ధరణి తెలంగాణ రైతాంగానికి శాపంగా మారిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూదాన్, ల్యాండ్ సీలింగ్ భూములపై ప్రభుత్వం కన్ను పడిందన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములను గుంజు కుంటూ, ప్రైవేట్ వ్యక్తులకు, కంపెనీలకు అమ్ముతూ ప్రభుత్వం కూడా బ్రోకర్ పని చేస్తోందంటూ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమావేశంలో సౌడ రమేష్, ఉడుగుల రమేష్, ముక్కెర తిరుపతిరెడ్డి, కేవీఎల్ఎన్.రెడ్డి, శివరాజ్ యాదవ్, కొంతం శ్రీను, హరిశ్చంద్ర గుప్తా, పి.జగదీష్, భాస్కర్రెడ్డి, బెజాడి బీరప్ప, దండు శ్రీను పాల్గొన్నారు