తెలంగాణలో 2 సీట్లతో సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 సీట్లకు ఎన్నికలు
న్యూ దిల్లీ, మే 12 : పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
మొత్తం 57 సీట్లలో.. తెలంగాణ నుంచి రెండు సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఆంధప్రదేశ్ నుంచి నాలుగు బర్తీ చేయాల్సి ఉంది. ఏపీ నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరిల పదవీకాలం ముగియనుంది. అలాగే తెలంగాణ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్లు రిటైర్ అవుతున్నారు.