సొంత ఫామ్హౌజ్ కోసమే నీటి ప్రాజెక్టుల నిర్మాణం
కెసిఆర్పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు
ప్రజాతంత్ర, గజ్వేల్, మార్చి 19 : మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల వల్ల వేలాదిమంది నిరుపేదలు నిరాశ్రయులైతే కేసీఆర్ పట్టించుకోవడంలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కొండపోచమ్మ ద్వారా పేదలకు నీళ్లియ్యడంలేదని, తన ఫాం హౌజ్కు ఆ నీళ్లను కేసీఆర్ తోడుకపోతున్నారని మండిపడ్డారు. రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ఎకరాకు రూ.5 కోట్ల విలువున్న భూములకు రూ.10 లక్షలు ఇస్తామంటూ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకోవడానికి వి•నాక్షి నటరాజన్ సర్వోదయ సంకల్ప పాదయాత్రను మొదలుపెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. భూదాన్ ఉద్యమానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత వి•నాక్షి నటరాజన్ చేపడుతున్న సర్వోదయ సంకల్ప పాదయాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
మేడ్చల్ నియోజక వర్గం నుంచి గజ్వేల్ నియోజక వర్గం కాళ్ళకల్ వరకు పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… భూమిలేని నిరుపేదల కోసం 75 ఏళ్ల కిందట వినోబా భావే ఈ ప్రాంతం నుంచే భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. ఈ క్రమంలో దళితులు, గరిజనులు, ఇతర నిరుపేదలకు వినోబాభావే వందల ఎకరాల భూమిని పంచిపెట్టారన్నారు. కేసీఆర్ పాలనలో రైతుల భూమికి విలువలేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలోని రైతులకు వరి వేయొద్దని చెప్పిన కేసీఆర్.. తన ఫాం హౌజ్లో మాత్రం 150 ఎకరాల్లో వరి సాగు చేయడమేంటని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అంటూ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ను ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ధరణి పోర్టల్తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
మల్లన్న సాగర్, కొండపోచమ్మ పేరుతో భూములు లాక్కుని పేదలను రోడ్డున పడేశారని విమర్శించారు. కేసీఆర్ తన బంధువు కోసం కొండ పోచమ్మను రీడిజైన్ చేశారని ఆరోపించారు. కొండ పోచమ్మ నీరు కేసీఆర్ ఫామ్ హౌజ్కు తప్ప ఎవరికీ రావడం లేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో మళ్లీ భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. రూ.5 కోట్లు విలువున్న భూమిని లాక్కుని రూ.10 లక్షలు బిక్షం ఇస్తాం అంటున్నారన్నారు. ఎకరానికి పది లక్షల చొప్పున తీసుకుని కేసీఆర్ ఫామ్ హౌజ్ భూమిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ‘నీ భూమి నీ దగ్గర ఉండాలి. కోట్ల విలువ పెరుగాలి. పేదల భూములు గుంజుకుని వారి కడుపు కొడతావా?. అందరిని వరి పండిచొద్దు అన్న కేసీఆర్ తన ఫామ్ హౌజ్లో వరి ఎలా వేశారు. రైతులకు ఓ నీతి, నీకో నీతా?’ అంటూ రేవంత్ ప్రశ్నించారు.