బాల్క సుమన్కు జగ్గారెడ్డి సవాల్
ఓయూకు రాహుల్నైనా రానివ్వండి…కేసీఆర్నైనా తీసుకెళ్లండి
ఓయూ లోపాలు బయటపడతాయనే రాహుల్ను అడ్డుకుంటుండ్రు…
వారికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు
క్షేత్రస్థాయిలోనే వారి సంగతి తేలుస్తాం
రాహుల్ ఓయూ సందర్శనపై కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి ఘాటు వార్నింగ్
హైదరాబాద్,ప్రజాతంత్ర •ఏప్రిల్ 30 : నాకు గన్మెన్లు లేరు. నేనొక్కడినే మీ ఇంటికొస్తా..దమ్ముంటే నన్ను కొట్టండి అంటూ పరోక్షంగా బాల్క సుమన్ను ఉద్దేశించి సవాల్ విసిరాడు. నన్ను మేకపోతు, దున్నపోతు అనండి. దమ్ముంటే నన్ను కొట్టండి. స్టేచర్లేని, ఎందుకు పనికిరాని కొన్ని చెత్తకుండీలే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. నేను తిట్టడం మొదలు పెడితే ఎవరూ తట్టుకోలేరు. ఎవరి సత్తా ఏందో క్షేత్రస్థాయిలో చూసుకుందాం, దీని కోసం నేనెప్పుడూ రె‘ఢీ’గా ఉంటా..’ అని కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గా రెడ్డి టిఆర్ఎస్ ఎంఎల్ఏ బాల్క సుమన్ రాహుల్ గాంధీ ఓయూ సందర్శన విషయమై చేసిన వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇద్దరి మధ్య మాటల ‘వార్’ కొనసాగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు దూషణలు చేసుకుంటున్నారు. సవాళ్లు విసుకుంటూనే ఉన్నారు. పోశమ్మ గుడిలో పొట్టేలును కట్టేసినట్టు ఉంటాడు జగ్గారెడ్డి ఉంటాడంటూ… బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తాజాగా శనివారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అంతేస్థాయిలో స్పందించారు.
విరుచుకుపడ్డారు. బాల్క సుమన్కు తనదైనశైలిలో సవాల్ విసిరాడు. వార్నింగ్ ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేతగా రాహుల్గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి రానివ్వకుండా అడ్డుకోవడం వెనకాల మతలబు ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ కోసం యూనివర్సిటీ విద్యార్థులు పోరాడరనీ, ప్రాణ త్యాగాలు చేశారనీ, స్వరాష్ట్రం వొచ్చిన తర్వాత తెలంగాణ కోసం పొట్లాడిన విద్యార్థులెలా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి విద్యార్థులతో మాట్లాడటానికి ఎంపి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ వొస్తారంటే ఎందుకు అడ్డుకుంటారనీ ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్ కోసమే రాహుల్ను ఓయూకు తీసుకొస్తామనీ తాము పెట్టుకున్న రిక్వెస్ట్ టెటర్ను విసి తిరస్కరించడం పట్ల జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమైక్య రాష్ట్రంలో యూనివర్సిటీలకు అందరూ వెళ్లొచ్చనే జీవోలు ఉంటే…స్వరాష్ట్రంలో ఓయూలో రాజకీయ సభలకు అనుమతులు లేవంటూ కొత్త జీవోలు ఎలా తెస్తారనీ సిఎం కేసీఆర్ను ప్రశ్నించారు. ఓయూ విసి ఓ డమ్మీ అన్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ యూనివర్సిటీకి వొస్తారనీ, రాహుల్ వొస్తే యూనివర్సిటీలోని అవకతవకలు, విద్యార్థులెదుర్కుంటున్న సమస్యలు యావత్ ప్రపంచానికి తెలుస్తాయనే ఉద్దేశంతోనే రాహుల్ను రానివ్వకుండా అనుమతుల పేరుతో అడ్డుకుంటున్నారన్నారు. తెలంగాణను ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్కు కేసీఆర్ సిఎం హోదాలో ఇస్తున్న బహుమతా ఇదీ అంటూ ప్రశించారు. రాహుల్ ఓయూకు వెళ్లితే విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కారమయ్యే ఆస్కారం ఉందన్నారు.
రాహుల్కు ఓయూకు అనుమతి ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావునైనా తీసుకెళ్లి విద్యార్థులతో మాట్లాడించి వాళ్లు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కారమయ్యేలా టిఆర్ఎస్ నేతలు చూడాలన్నారు. విద్యార్థులందరూ టిఆర్ఎస్ పార్టీ నేతల మోసాలను గ్రహించాలన్నారు. సమైక్య రాష్ట్రంలో ఓయూలో లేని నిబంధనలు కోరి తెచ్చుకున్న తెలంగాణలో విధిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇది సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాహుల్ గాంధీని ఇప్పుడు ఓయూకు వెళ్లేందుకు టిఆర్ఎస్ అనుమతి ఇవ్వకపోవచ్చు. కానీ, ఇదీ తాత్కాలిక బ్రేకే. ఎప్పుడో ఒకసారి రాహుల్ను ఓయూకు తీసుకెళ్తాం. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తాం. వారి సమస్యలను తెలుసుకోవడం మాత్రం ఖాయమన్నారు. టిఆర్ఎస్లోని స్టేచర్లేని కొన్ని చెత్త కుండీలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయనీ, రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలంటున్నాయనీ, రాహుల్ ఎందుకు క్షమాపణ చెప్పాలో ఆ చెత్తకుండీల సంగతి తాము కూడా క్షేత్రస్థాయిలోనే తేల్చుకుంటామనీ జగ్గారెడ్డి కాస్త ఘాటుగానే హెచ్చరించారు.