అనిశ్చితి ఏర్పడుతుందన్న ధర్మాసనం
న్యూ దిల్లీ, మే 13(ఆర్ఎన్ఎ) : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ పీజీ 2022 వాయిదాకు సుప్రీమ్ కోర్టు నిరాకరించింది. నీట్ పీజీ- 2022 పరీక్షలను వాయిదా వేస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ధర్మాసనం పేర్కొంది. పరీక్షల వాయిదా గందరగోళం అనిశ్చితితోపాటు వైద్యుల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని, కాబట్టి పరీక్ష వాయిదా వేయలేమని తెలిపింది.
కాగా నీట్ పీజీ-2021 కౌన్సిలింగ్ ఉన్నందున చదువుకోవడానికి తగినంత సమయం లేకపోవడంతో పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ వైద్యుల బృందం పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్ల వాదనను సుప్రీమ్ కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారణ జరిపి శుక్రవారం తీర్పును వెల్లడించింది. నీట్ పీజీ 2022 పరీక్షలు వాయిదా వేయడం సరైన ఆలోచన కాదని, దీని వల్ల ఈ పరీక్ష రాసే 2 లక్షల మంది విద్యార్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనిసనం తెలిపింది.
కొంత మంది అభ్యర్థలు పరీక్షను వాయిదా వేయమని కోరుతున్నారని… అయితే అత్యధిక మంది ఎగ్జామ్ నిర్వహించాలని కోరుకుంటున్నారని కోర్టు తెలిపింది. ఇక ప్రభుత్వం కూడా పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసిందని…ఈ సమయంలో ఎగ్జామ్ వాయిదా నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా వేయడం వల్ల రోగి సంరక్షణ, వైద్యుల కెరీర్ పై ప్రభావం చూపుతుందని బెంచ్ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఎలా.పరీక్షను వాయిదా వేస్తామని కోర్టు ప్రశ్నించింది. కాగా ఈ ఏడాది మే 21న నీట్ పీజీ పరీక్షను నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డ్లు మే 16, 2022 నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి.