- ఉక్రెయిన్లో మృతి చెందిన మెడికల్ విద్యార్థి
- భౌతిక కాయాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు
బెంగుళూరు, మార్చి 19 : ఉక్రెయిన్లోని ఖార్కివ్లో మృతిచెందిన మెడికల్ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహం తీసుకుని వొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆ విద్యార్థి భౌతికకాయాన్ని సోమవారం తీసుకువస్తున్నట్లు కర్నాటక సీఎం బొమ్మై చెప్పారు. అయితే నవీన్ భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్లు ఆయన తండ్రి చెప్పారు. హవేరి జిల్లాకు చెందిన నవీన్ శేఖరప్ప భౌతికకాయానికి ఎంబాల్మింగ్ చేసినట్లు కేంద్ర మంత్రి జైశంకర్ ఇటీవల తెలిపారు. అయితే యుద్ధం కారణంగా బాడీ తరలింపు ఆలస్యం అవుతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఖార్కివ్ జాతీయ మెడికల్ యూనివర్సిటీలో నవీన్ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అంతిమ సంస్కారాలు నిర్వహించిన తర్వాత నవీన్ మృతదేహాన్ని దేవనగరిలో ఉన్న ఎస్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్ సెంటర్లో అప్పగించనున్నారు.