కొత్తగా 3377 మందికి పాజిటివ్..60 మంది మృతి
దేశంలో వేరియంట్ల విజృంభణ స్వల్పమే అన్న ఇన్సాకాగ్
న్యూ దిల్లీ, ఏప్రిల్ 29 : దేశ వ్యాప్తంగా కొరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ 3 వేల పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల్లో 3377 మందికి పాజిటివ్ నమోదుకాగా, మాహామ్మారి కారణంగా 60 మృతి చెందారు. మరణాల సంఖ్య కూడా క్రితం రోజు కన్నా పెరిగింది. కాగా కొరోనా నుంచి మరో 2,496 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 17,801 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తంగా కొరోనా కేసుల సంఖ్య 4,30,72,176కు చేరగా మరణాల సంఖ్య 5,23,753కు చేరుకుంది. దేశంలో కొరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గురువారంతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగానే పెరిగినప్పటీకీ రోజువారీ పాజిటివిటీ రేటు 0.71శాతానికి చేరిందని అన్నారు. యాక్టివ్ కేసుల రేటు 0.04 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది.
ఇక దేశంలో కొరోనా వైరస్కు సంబంధించి కేంద్ర పరిధిలోని ఇన్సాకాగ్ ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కాన్సోర్టియమ్ ఊరట ఇచ్చే విషయం చెప్పింది. స్వల్పంగా కేసులు పెరుగుతూ పోతున్న వేళ.. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నారు. అయితే మిగతా దేశాలతో పోలిస్తే..భారతదేశంలో కొరోనా వైరస్కు సంబంధించి చాలా తక్కువ రీకాంబినెంట్ వేరియెంట్లు వెలుగు చూశాయని ప్రకటించింది. అంతేకాదు..ఈ రీకాంబినెట్ వేరియెంట్లు.. వైరస్ తీవ్రవ్యాప్తికి కారణం కాలేదని, అలాగే హాస్పిటళ్లలో చేరిన కేసులు..తీవ్రస్థాయిలో ఇన్ఫెక్షన్కు గురైన పేషెంట్లపైనా ప్రభావం చూపలేదని ఇన్సాకాగ్ తన నివేదికలో పేర్కొంది. తాజాగా దిల్లీలో కొరోనా వైరస్ ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన వేరియెంట్ బీఏ.2.12.1 కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ తరుణంలో వేరియెంట్ల తీవ్రతపై ఆందోళన నెలకొనగా..తగు జాగ్రత్తలు తీసుకుంటే మరోవేవ్ నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులతో పాటు కేంద్రం కూడా చెబుతుంది.