- మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో పవర్ హాలీడే
- దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు
- ఈ ఏడాది 2 లక్షల మందికి అమలు
- పటాన్చెరులో దళిత బంధు పంపిణీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు
పటాన్చెరు,ప్రజాతంత్ర, ఏప్రిల్ 1 : దేశానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది శూన్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు మరోసారి కేంద్రంలోని బిజెపి సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని మైత్రీ మైదానంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గం దళిత బంధు ప్రాజెక్టులో భాగంగా 100 యూనిట్లను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి మంత్రి హరీష్రావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బిజెపి పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేదన్నారు. అన్ని వర్గాల శ్రమను బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దోచుకుంటున్నదని ఆరోపించారు. బిజెపి పార్టీ…భారతీయ జూట పార్టీగా మారిందని విమర్శించారు. ఎన్నికల కోసమే బిజెపి స్టంట్ చేస్తుందని చెప్పారు. తెలంగాణలో పవర్ హాలిడే లేదు, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇస్తున్నారని తెలిపారు. దేశంలోని సగం రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నాయనీ, కానీ తెలంగాణలో కరెంట్ సమస్యలు లేవన్నారు. దేశంలోనే తెలంగాణ పవర్ ఫుల్ స్టేట్గా మారిందని పేర్కొన్నారు. సిఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ సమస్య లేకుండా చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం 7000 మెగా వాట్స్ నుండి 17000 మెగా వాట్స్ సామర్థ్యం పెంచి కరెంట్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. దేశం మొత్తం కరెంట్ సంక్షోభంలో ఉంటే తెలంగాణలో వెలుగు జిలుగులు ఉన్నాయని అన్నారు. కేంద్రం తీరు వల్లనే దేశం మొత్తం కరెంట్ సంక్షోభంలో ఉన్నదని తెలిపారు. కేంద్ర వైఖరితో సామర్థ్యం ఉన్న ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో దేశం మొత్తం కరెంట్ కోతలు ఉన్నాయని అన్నారు. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళిత బంధు కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని కోడకంచి, అనంతరం, బచ్చుగూడెం మూడు గ్రామాల్లో 100 మందికి వాహనాలు, యూనిట్స్ లను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో దళిత బంధు పథకం అమలు వేగంగా పూర్తి అవుతుందని తెలిపారు. దళిత బంధుతో దళిత కుటుంబాల జీవితాల్లో మార్పులు రావాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుల కోసం నేరుగా పది లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. గతంలో బ్యాంక్ లోన్లు కట్టకుండా దళితులు అప్పులపాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. రాష్ట్రం మొత్తంలో 300 వైన్ షాపులు దళితులకు కేటాయించడం జరిగిందన్నారు. నూతన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకువచ్చామని చెప్పారు. అన్ని ప్రభుత్వ టెండర్లులో ఎస్సీలకు అవకాశం ఇస్తున్నామని అన్నారు. దళితుల సంక్షేమంకు తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎస్సీలతో ప్రారంభమైన కల్యాణ లక్ష్మీ, తర్వత అన్ని వర్గాలకు అందరికీ ఇస్తున్నామని గుర్తు చేశారు. అదేవిధంగా దళిత బంధు మాదిరిగా మిగితా వర్గాలకు కుడా భవిషత్తులో ఇస్తామని చెప్పారు. దళిత బంధు ఒక పథకం కాదు, ఒక ఉద్యమం అన్నారు. బడ్జెట్లో 17,800 కోట్లను దళిత బంధు పథకం కోసం కేటాయించడం జరిగిందన్నారు. వొచ్చే బడ్జెట్ కలుపుకొని ఈ ఏడాది 2 లక్షల మందికి దళితబంధు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, కలెక్టర్ హన్మంతరావు, ఎస్పీ రమణకుమార్, మాజీ ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ రాజర్షిషా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, ఆర్డీవో నగేష్, జడ్పీ సిఈవో ఎల్లయ్య, డిఆర్డీవో శ్రీనివాసరావు, పటాన్చెరు డిఎస్పి భీమ్రెడ్డి, దళితబంధ•• ప్రత్యేకాధికారి ప్రసాద్, జడ్పిటిసిలు, ఎంపిపిలు, మునిసిపల్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.