కొచ్చి, ఏప్రిల్ 3 : తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్ జడ్జి తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ (63) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా రాధాకృష్ణన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో 1959 ఏప్రిల్ 29న జన్మించారు. అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. తిరువనంతపురంలో 1983లో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేక హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి.
2019 జనవరిలో తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా అప్పటి గవర్నర్ నర్సింహన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఛత్తీస్గఢ్, ఆంధప్రదేశ్ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్ కొన్ని నెలలు మాత్రమే కొనసాగారు. టీబీ రాధాకఅష్ణన్ 2004 అక్టోబర్ 14న కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండుసార్లు కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కేరళ లీగల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గానూ కొనసాగించారు. 12ఏళ్లు కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.