ఒకవైపు ఒంగోలులో తెలుగుదేశం మహానాడుకు తోడు తెలంగాణాలో ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద పోటెత్తిన టీఆర్యస్ రాజకీయ, కుల సమీకరణ నివాళులు ఏ పునరేకీకరణకో తెలంగాణ ఉద్యమకారులు గమనిస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏ విలువలను, అభివృద్దిని, సామాజిక సమీకరణలను తెలంగాణాలో నెలకొల్పిందో భిన్నాభిప్రాయాలతోనైనా చరిత్రగా మిగిలినందున ఆయనకు శ్రద్దాంజలి ఘటించడం అభ్యంతరకరం కాదు గాని, మితిమీరి త్యాగాల పునాదుల మీద వచ్చిన రాష్ట్రంలో తెలుగుదేశంలో సామాజిక వర్గీకరణలో, ప్రాధాన్యతలో భాగంగా పైకి ఎగబాకి మంత్రులు, పెద్దనాయకులైన నేటి అదే గుంపు ఓట్ల పోలరైజేషన్ కోసం చేస్తున్న హడావిడి తెలంగాణ ఉద్యమకారులను, రాష్ట్రసాధనలో పాల్గొన్న సబ్బండవర్ణాల బిడ్డల ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నది.
యువతకు, బి.సి లకు పెద్దపీట వేసిన ఎన్టీఆర్ నుండి స్ఫూర్తి పొందితే టి.ఆర్.యస్, ఇప్పుడు ఆధిపత్య వర్గాలకు కొత్త పటేల్గిరి అప్పజెప్పకపోవును కదా!. కోనసీమకు అంబేడ్కర్ జిల్లాగా పేరు మార్చితే జరిగిన ఆందోళన, హింసాకాండను ఖండించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక సామాజిక పోరాటాలకు తెలంగాణబిడ్డలు మద్దతు ఇవ్వడం అందరికి తెలిసిందే. నాడు సమైక్యరాష్ట్రంలో, నేడు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అట్టడుగు వర్గాల బహుజనులు రాజకీయ అధికారంలో భాగమయి, అభివృద్దికి పాటుపడుదామంటే శిశుహత్యల తీరు మొగ్గలోనే అవకాశాలను తుంచివేయడం అన్ని పార్టీల్లో రివాజుగా మారింది. కోనసీమకు అంబేడ్కర్ పేరంటే తలలూపిన వాళ్ళే పేరు పెట్టగానే ప్లేటు ఫిరాయించి విధ్వంసం సృష్టించినట్లు సామాజిక న్యాయంకై నిత్యం గగ్గోలుపెట్టే నాయకులు ఎన్నికల్లో తమ సామాజికవర్గాల కోసం తెలంగాణలో ఎంత వికృతంగా రాజకీయాలు నడుపుతారో అందరు గమనిస్తున్నారు.
కులాల వికారానికి తోడు శవాల చర్చను తీసుకొచ్చి బండి సంజయ్ తెలంగాణ ఉద్యమస్ఫూర్తినే అవమానపరుస్తున్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో -హుస్సేన్సాగర్లో శవాలు మావి, ట్యాంక్బండ్పై విగ్రహాలు మీవా?-అన్న చైతన్యాన్ని సవాల్ చేస్తూ -మసీదులు తవ్వితే శివలింగాలు మావి… శవాలు మీవి అన్న వాచాలత ఎంత అలజడిని, విలువల పతనాన్ని సృష్టిస్తున్నది? కుల, మత రాజకీయాలు విశృంఖలంగా మాట్లాడే, ఆచరించే జాతీయ, ప్రాంతీయ పార్టీలు బహుజనుల రాజ్యాధికారం కోసం కార్యాచరణకు సిద్దమైతే అష్ట దిగ్భందాలు, శతసహస్ర అవదాన అబద్దాలు, ఇన్ని వైపరిత్యాల మధ్య రాష్ట్రంలో ఉద్యమ, సామాజికశక్తుల ఐక్యత, రాజకీయ పునరేకీకరణ కోసం అనేక పాదయాత్రలు, ప్రయాసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది దీర్ఘకాల ఎదురీతగా అందరం మద్దతు తెలుపాల్సిందే. బి.సీల కులగణన కోసం ఆందోళన ఉధృతం చేసి రాజకీయంగా బలపడటం, ఎన్నికల రాజకీయాలను శాసించడం తెలంగాణ ఉద్యమ, సామాజికశక్తుల కర్తవ్యంగా గుర్తు చేస్తున్నాము.
– డా. చెరుకు సుధాకర్
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు