అనకాపల్లి, ఫిబ్రవరి 24 : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఇందులో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. అనకాపల్లి నుంచి పాయకరావుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ధర్మవరం వద్ద ఆగింది. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి ముందు ఉన్న మరో ఆటోను ఢీకొట్టింది. దీంతో బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే స్థానికులు.. విషయాన్ని పోలీసులకు వివరించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విశాఖలోని ఇసుకతోటకు చెందిన పరసయ్య (55) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.