ఆయువును హరిస్తున్న కాలుష్య వాయువు

మన చుట్టూ మనం ఏర్పరుచుకున్న కాలుష్యాలే మన ఊపిరి తీస్తున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతీ సంవత్సరం లక్షలాది మంది ప్రజలు కాలుష్యం వలన మృత్యు బారిన పడుతున్నారు. విశ్వవ్యాప్తంగా చూస్తే ప్రతి ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నట్లు తాజాగా లాన్సెట్‌ ‌నివేదిక ద్వారా వెల్లడయ్యింది.అంతే కాదు 2019లో వివిధ రకాల కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 9 మిలియన్ల (90 లక్షల మంది) మరణించారని .ఈ మొత్తం కాలుష్య మరణాలలో కేవలం వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో ఒక్క ఏడాదేలోనే 66లక్షల మంది బలయ్యారని నివేదిక తెలిపింది. అన్ని రకాల కాలుష్యాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏడాది ప్రతి లక్ష మందికి సగటున 117 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో అత్యధికంగా సెంట్రల్‌ ఆ‌ఫ్రికా దేశమైన చాద్‌ ‌లో ప్రతి లక్ష మందికి 300 మంది చనిపోతుండగా అతి తక్కువ కాలుష్య కారక మరణాలు బ్రునై, ఖతార్‌, ఐస్లాండ్లలో చోటుచేసుకుంటున్నాయి.

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే కాలుష్య మరణాలలో మన దేశం అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది.అన్నిరకాల కాలుష్యాల కారణంగా భారత దేశంలో ఒక్క (2019) ఏడాదిలోనే 23 లక్షల అకాల మరణాలు సంభవించగా వీటిలో 16 లక్షల మంది మన దేశంలో కేవలం వాయు కాలుష్యం వల్లే మరణించినట్లు నివేదిక తెలిపింది.రెండవ స్థానాన్ని మాత్రం చైనా 22 లక్షల మరణాలతో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది.అమెరికాలో పరిశీలిస్తే దీని ప్రభావం వలన లక్షా 42 వేల మంది బలయ్యారు. కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల కారణంగా దేశంలో రోజుకు సగటున 6,500 మరణాలు జరుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది కొరోనా మహమ్మారి సమయంలో మరణించిన వారి కంటే చాలా రెట్లు ఎక్కువ భారతదేశంలో వాయు కాలుష్య సంబంధిత మరణాలు (9.8 లక్షలు) పరిసర PM 2.5 కాలుష్యం వల్లనే సంభవించాయని ఈ నివేదిక ప్రధాన సారాంశం.పీఎం అంటే పర్టిక్యులేట్‌ ‌మేటర్‌ (అత్యంత సూక్ష్మమైన దుమ్ము, ధూళి కణాలు). 2.5 మైక్రోమీటర్ల కన్నా చిన్నవాటిని పీఎం 2.5, 10 మైక్రోమీటర్ల పరిమాణం ఉన్నవి పీఎం 10 గా పేర్కొంటారు. నిర్మాణాలు జరుగుతున్న చోట, కచ్చారోడ్లు, వ్యవసాయ క్షేత్రాలు, మంటలు, వివిధ రకాల పొగల నుంచి ఇవి ఏర్పడుతాయి. సల్ఫర్‌ ‌డయాక్సైడ్‌, ‌నైట్రోజైన్‌ ఆక్సైడ్‌ ‌వంటి ప్రమాదకర వాయువులు పవర్‌ ‌ప్లాంట్లు, పరిశ్రమలు, వాహనాల నుంచి ఇవి ఎక్కువగా వెలువడతాయి. గాలిలో కాలుష్యకారక మైన సూక్ష్మాతి సూక్ష్మమైన ధూళి కణాలు పీఎం 2.5 అంశంలో కూడా భారత్‌ ‌ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. గాలిలో పీఎం 2.5 7.5 నుంచి 8.5 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు లెక్క. గ్లోబల్‌ ఎయిర్‌ ‌నివేదిక ప్రకారం భారత్‌లో 8.3 వరకు ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.దేశంలోని 93 శాతం విస్తీర్ణంలో క్యూబిక్‌ ‌మీటరుకు 10 మైక్రోగ్రాముల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ‌మార్గదర్శకాల కంటే భారతదేశం PM 2.5 కాలుష్యం చాలా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు ప్రకారం మనుషులు ఏడాదిపాటు పీల్చేగాలిలో 2.5 పీఎం రేణువులు 5 గ్రాములకంటే ఎక్కువ ఉండకూడదు, 10 పీఎం రేణువులు 15 గ్రాములు దాటకూడదు. నైట్రోజన్‌ ఆక్సైడ్‌ ‌సాంద్రత ఏడాదికి పదిగ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ ప్రపంచంలో చాలా వరకు అధికాదాయ దేశాల్లోని నగరాలు ఈ స్థాయిలను ఎప్పుడో దాటి ప్రమాదకర స్థితికి వెళ్లిపోయాయి.

క్షీణిస్తున్న ఆయుః ప్రమాణం

1998-2018 మధ్యలో పరిశీలిస్తే భారతీయులు సగటున 1.80 ఏళ్ల జీవితకాలాన్ని కోల్పోయారు. 2018 నాటి వాయుకాలుష్యమే ఇప్పుడు కూడా కొనసాగితే.. రాబోయే ఏళ్లలో సగటు భారతీయుని జీవిత కాలం 5.20 ఏళ్లు తగ్గిపోతుందని హెచ్చరికలు చేసినా కూడా ప్రభుత్వాలు ఈ విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పవచ్చును.. దీనివలన దేశంలో 84 శాతం మంది నిర్దేశించిన వాయు కాలుష్య ప్రమాణాల కంటే దిగజారిన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. మన దేశంలో వాయు కాలుష్యం తీవ్రత దక్షిణ భారతం కంటే ఉత్తర భారతంలో చాలా ఎక్కువుగా ఉంది. అక్కడ 24.80 కోట్ల మంది భారతీయుల సగటు జీవితకాలం 8 ఏళ్లు హరించుకుపోతుందని ఒక అధ్యయనం తెలిపింది.ఉత్తర భారతంలో ఉత్తర ప్రదేశ్‌ ‌రాజధాని లక్నో వాసులు మాత్రం అత్యధికంగా ఆయుః ప్రమాణాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుత వాయు కాలుష్యం ఇలాగే కొనసాగితే ఇక్కడి వాసులు సగటున 10.30 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోతారుని పర్యావరణ వేత్తలు హెచ్చరికలు జారీ చేశారు.దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి అయితే మరింత ఆందోళనకరంగా ఉంది. దక్షిణ భారతంలో చూస్తే తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా తరువాత స్థానాల్లో వరుసగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ‌కేరళ ఉన్నాయి. గాలి కలుషితమై పసిపిల్లల ఉసురు తీస్తున్న దేశాల విషయంలో కూడా భారత్‌లోనే అత్యధికం. 2019లో 1,16,000 మంది చిన్నారులు భూమ్మీదకి వచ్చిన నెలరోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. భారత్‌ ‌తర్వాత స్థానంలో నైజీరియా (67,900 మంది పిల్లల మృతి), పాకిస్తాన్‌ (56,500), ఇథియోపియా (22,900), డెమొక్రాటిక్‌ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌కాంగో (1,200) ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. వాయు కాలుష్యము కారణంగా సగటున 9.20ఏళ్లు, భారత ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం అయితే 6.50 ఏళ్లు జీవితకాలాన్ని కోల్పోతారు.

షికాగో యూనివర్సిటీ ఎయిర్‌ ‌క్వాలిటీ లైఫ్‌ ఇం‌డెక్స్’ ‌పేరిట నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం ప్రకారం భారతీయుల సగటు జీవితకాలం ఏకంగా 5 సంవత్సరాలు హరించేస్తుంది. దీని తీవ్రతతో ప్రజలు జీవితకాలాన్ని కోల్పోతున్న దేశాల జాబితాలో.. ప్రపంచంలో బంగ్లాదేశ్‌ ‌మొదటిస్థానంలో ఉండగా భారత్‌ ‌రెండో స్థానంలో ఉందని ఈ నివేదిక వెల్లడించింది .దీనిని బట్టి పరిశీలిస్తే ప్రపంచ వ్యాప్తంగా సే వాయు కాలుష్యం ప్రభావం తీవ్రత ఎంత ఉంది అనేది మనకు అర్థం అవుతుంది.ఇదే సంవత్సరంలో మనదేశంలో కాలుష్య ప్రభావాన్ని పరిశీలిస్తే జనాభా విషయంలో మనం చైనా ని అధిగమించలేకపోయినా కాలుష్యం పరంగా మాత్రం మనం చైనా కంటే ముందు స్థానాన్ని కైవసం చేసుకుని ప్రపంచంలోనే ప్రధములుగా నిలిచాం.వీటి అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని లాన్సెట్‌ ‌కమిషన్‌ ‌ప్రస్తుత వాయు కాలుష్యం పై సంచలన వ్యాఖ్యలు చేసింది, ప్రపంచ ఆరోగ్యంపై కాలుష్య ప్రభావం ‘‘యుద్ధం, ఉగ్రవాదం, మలేరియా, HIV, క్షయ, డ్రగ్స్ ‌మరియు ఆల్కహాల్‌ ‌కంటే చాలా ఎక్కువ’’ అని పేర్కొంది.

ఆరోగ్య నష్టంతో పాటు సామాజిక, ఆర్థిక నష్టాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ అభివృద్ధి ఎజెండాలో కాలుష్య నివారణను పలు దేశాలు పట్టించుకోవడం లేదని కలుషితమైన గాలి, విషపూరిత రసాయనాల వల్ల ప్రాణనష్టం తో పాటు అకాల మరణాలతో 2019లో ప్రపంచానికి 4.6 ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని దేశ జీడీపీకి 1శాతం నష్టం వాటిల్లుతోందని నివేదిక స్పష్టం చేసింది.అంతే కాదు దీని ప్రభావం వలన భారత్లో గర్భస్రావాల ముప్పు కూడా అధికంగా ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. సిబ్బందిలో చురుకుతనం తగ్గి ఉత్పాదకత మందగించి అనేక వాణిజ్య సంస్థలు నష్టపోతున్నాయి. వాయు కాలుష్యము అనేది అత్యంత తీవ్రమైన విషయమైనప్పటికీ కాలుష్యాన్ని నివారించడంలో అంతర్జాతీయ స్థాయిలో పట్టించుకోవడం లేదనే అనేక విమర్శలు ఉన్నాయి. అయితే, వీటిపై ప్రజల్లో అవగాహన తేవడానికి పెద్ద ఎత్తున సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కాలుష్యాన్ని అరికట్టడానికి  వాటికి అవసరమైన నిధులు కేటాయింపులో పెరుగుదల నామమాత్రంగానే ఉందని లాన్సెట్‌ ‌నివేదిక స్పష్టం చేసింది.ప్రధానంగా మన దేశం కాలుష్య మూలాలను తగ్గించడానికి సాధనాలు మరియు నియంత్రణ అధికారాలను అభివృద్ధి చేసింది,దానితో పాటు జాతీయ వాయు శుభ్రత కార్యక్రమం సహా పలు కార్యక్రమాలను ప్రభుత్వం కాలుష్య నివారణకు చేపట్టింది, కానీ భారత్‌లో వాయుకాలుష్య నివారణకు బలమైన కేంద్రీయ వ్యవస్థ మాత్రం లేదని నివేదిక తెలిపింది.భారతదేశంలోని 93%లో, కాలుష్యం మొత్తంWHO మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉందని ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కాలంలో మరింత ప్రమాదం ముంచుకొస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.కాలుష్యం అదుపు చేయడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు పౌరుల బాధ్యత కూడా అని గ్రహించిన నాడు దీనిని తప్పక అదుపు లోనికి తీసుకు రావచ్చు.అది గ్రహించనంత కాలం ఈ మరణాల జాబితా వృద్ది చెందుతూనే ఉంటుంది తప్ప అదుపు అనేది అసాధ్యమనే చెప్పవచ్చును.

image.png

రుద్రరాజు శ్రీనివాసరాజు.

9431239578

లెక్చరర్‌…ఐ.‌పోలవరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page