(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
వరంగల్లో ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభపై బిఆర్ఎస్ పెద్ద ఆశనే పెట్టుకుంది. లక్షలాది మందితో నిర్వహించ తలపెట్టిన ఈ సభ బిఆర్ఎస్కు మరో టర్నింగ్ పాయింట్ కానుందన్న చర్చ జరుగుతున్నది. టిఆర్ఎస్ పార్టీ ఏర్పడి మార్చి 27కు 24 ఏండ్లు పూర్తిచేసుకుని 25వ సంవత్సరంలోకి చేరుకుంటుండడంతో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ను భారీ ఎత్తున చేసేందుకు ఆపార్టీ గత కొద్దిరోజులుగా సన్నాహాలు చేస్తోంది. ఈ రజతోత్సవ సభకు వరంగల్ను ఎంచుకోవడంలో ఒక ప్రత్యేకత ఉంది. 2001న టిఆర్ఎస్ ఆవిర్భావం మొదలు 11 ఏండ్ల కింద అధికారంలోకి రావడానికి ముందు వరకు ఆపార్టీ అనేక ఉత్తానపతనాలను చవిచూసింది. అనేక రాజకీయ వొత్తిడులను తట్టుకునే క్రమంలో బిఆర్ఎస్కు తరుచు వరంగల్ గుర్తుకొచ్చేది. వరంగల్లో సభ విజయవంతమయితే చాలు తెలంగాణ ప్రజలంతా తమ వెంటే ఉన్నారన్న భావన బిఆర్ఎస్కు ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్కు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రకటనలు వెలువడిన ప్రతీసారి పార్టీ శ్రేణులు డీలా పడిపోయేవారు. అలాంటి పరిస్థితిలో మేమంతా మీ వెంటే ఉన్నామని వరంగల్ ప్రజలు అభమిచ్చిన సంఘటనలు ఎన్నో ఉద్యమకాలంలో చోటుచేసుకున్నాయి. వరంగల్లో ఏర్పాటు చేసిన ప్రతీ బహిరంగసభ ఆనాడు విజవంతమడం ఉద్యమం డీలా పడకుండా ఆక్సీజన్ అందించినట్లు ఉండేది. దాంతో మళ్ళీ ఉద్యమం కొనసాగుతూ ఉండేది. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవంనుండీ అనేక ఆటుపోట్లను ఎదుర్కున్న విషయం తెలియందికాదు.
మొదట్లో ఫక్తు ఉద్యమ పార్టీగా కొనసాగినా, ఆ తర్వాత రాజకీయపార్టీగా రూపాంతరం చెంది విజయ పరంపరను సొంతం చేసుకుంటూ వొచ్చింది. ఒక ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న లక్ష్యంగా పోరాటం చేయడం, రాష్ట్రాన్ని సాధించడంతోపాటు దశాబ్దకాలంగా పాలన సాగించిన పార్టీగా బిఆర్ఎస్ చరిత్రలో నిలిచిపోయింది. అయితే 14 నెలల కింద మూడో సారి జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వొచ్చింది. ఆనాటి నుంచి పార్టీ ప్రభ కొడగడుతూ వొచ్చింది. పార్టీ పక్షాన గెలిపిన ఎంఎల్ఏలు ఒక్కొక్కరుగా దాదాపు 10 మంది పార్టీ మారడం, కొందరు ప్రజాప్రతినిధులు, మరికొందరు సీనియర్లు పార్టీలో ఉన్నత పదవుల్లో ఉండి కూడా కష్టకాలంలో పార్టీని వదిలివెళ్ళారు. ఇంకా కొందరు ఊగిసలాటలో ఉండడం పార్టీని ఇబ్బందిలో పడేసింది. ఫలితంగా గతంలో రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఎన్నికను ఛాలెంజీగా తీసుకుని నిలబడిన బిఆర్ఎస్ ఇప్పుడు వెనుకాడుతున్నది. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎంఎల్సీ ఎన్నికలే అందుకు ఉదాహరణ. తమ పార్టీపక్షాన అభ్యర్థులనే పోటీ పెట్టకపోవడం ఆ పార్టీ ప్రజల్లో పట్టు కోల్పోవడానికి తార్కాణమంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఆ పార్టీకి ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీ పటిష్టతపై అధిష్టానం దృష్టి పెట్టింది. మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. గత స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బిఆర్ఎస్ ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకునేందుకు తహతహలాడుతున్నది.
చాలా కాలంగా ఆ పార్టీలో సంస్థాగత నిర్మాణం లేకపోవడం ప్రధాన లోపమన్న విషయాన్ని అధిష్టానం గ్రహించింది. జిల్లా, మండల స్థాయి కమిటీల ఎన్నిక పై దృష్టి పెట్టింది. పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇంఛార్జీల నియామకాల కోసం రంగం సిద్దం చేస్తున్నది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం ద్వారా అధికార కాంగ్రెస్, బలోపేతమవుతున్న బిజెపిని ఎదుర్కోవడానికి సిద్దపడుతున్నది. అందుకే భవిష్యత్ ప్రణాళికంతా 27 నాటి బహిరంగ సభపై ఆధారపడి ఉంది. ఈ సభానంతరం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. గ్రామస్థాయిలో పార్టీ ఉన్నా, నాయకత్వ లోపాన్ని సవరించే దిశగా పార్టీ ప్రణాళికను రూపొందించుకుంటున్నది. అందులో భాగంగానే మే నెల నుంచి పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరం చేయబోతున్నట్లు ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు ఇప్పటికే ప్రకటించారు. జిల్లా అధ్యక్షుల నియామకం తో పాటు, రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పటిష్టమైన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారానికి దూరమైనంత మాత్రాన నాయకులు, కార్యకర్తలెవరూ నిరాశ, చెందాల్సిన అవసరం లేదని, కష్టకాలంలో పార్టీ వెంట ఉండి, పార్టీని బలోపేతం చేసే ప్రతీ నాయకుడిని పార్టీ గుర్తుపెట్టుకోవడంతో పాటు, పార్టీలో వారికి పెద్దపీట వేస్తుందంటూ క్యాడర్ను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తోంది బిఆర్ఎస్ అధినాయకత్వం.
పాదయాత్రకు సన్నాహాలు..!
2026లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు కెటిఆర్ సంచలనాత్మక ప్రకటన చేశారు. ఇంతవరకు పాదయాత్రల ద్వారా అధికారాన్ని చేపట్టిన ఉదంతాలు తెలంగాణలో ఉండడంతో కెటిఆర్ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ను కూడా ఇప్పటి నుంచే తయారు చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే తిరిగి అధికారంలోకి రావడానికి బిఆర్ఎస్ పాదయాత్రలను నమ్ముకుందా అన్నదిప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు పాదయాత్రల ద్వారా వైఎస్ రాజశేఖర్రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి, రేవంత్రెడ్డి లాంటివారు అధికారపీఠాన్ని అధిరోహించిన విషయం తెలియంది కాదు. అయితే వారు పాదయాత్రలు చేపట్టే నాటికి రాష్ట్రంలో ఉన్నపరిస్థితులువేరు, నేటి పరిస్థితి వేరన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి పదిహేను నెలలు కూడా పూర్తికాలేదు. అప్పుడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టడమన్నది ముందే కోయిల కూసిందన్నట్లుగా ఉంటుందన్న విమర్శలు లేకపోలేదు. ఏదిఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయకపోవడం లాంటి పాలనా వైఫల్యాలపై పోరాటం సాగిస్తున్న బిఆర్ఎస్ 27నాటి సభ తమ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా మలుపు తిప్పుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నది.





