– దాడిలో గాయపడిన క్రిస్టొఫర్ను పరామర్శించిన కె.టి.ఆర్.
– దాడులకు పాల్పడితే సహించబోం
– బుద్ధి చెప్పేవిధంగా ప్రజలను చైతన్యం చేస్తాం
– బీఆర్ ఎస్ కార్యకర్తపై దాడికి రేవంత్ బాధ్యత వహించాలి
-బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన 24 గంటలు కాకముందే కాంగ్రెస్ పార్టీ గూండాయిజానికి, రౌడీయిజానికి దిగి, దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నిన్న రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గం, రెహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ నివాసానికి ఆయన వెళ్లి పరామర్శించారు. మా పార్టీ అభ్యర్థి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేసిన ఈ ఎన్నికల్లో, అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని చేసిన దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ కూడా చేష్టలు ఉడిగి చూసిన వైనం ఫలితంగానే తాము సాంకేతికంగా ఓడిపోయామని కేటీఆర్ పేర్కొన్నారు. “పదేళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు హద్దులు దాటి ఈరోజు రాకేష్ క్రిస్టోఫర్ పై జరిగిన మాదిరిగా దాడికి పాల్పడ్డారా? ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన వెంటనే, నిన్న మీ వాళ్ళు మా పార్టీ గుర్తు కారును ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించారు. గతంలో ఏడు ఉప ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచినప్పుడు మేము ఎప్పుడైనా ఇలా ప్రవర్తించామా? అహంకారం ఎవరిదో, ఆత్మవిశ్వాసం ఎవరిదో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత మిడిసిపడితే, గతంలో పదేళ్ల పాటు అప్రతిహతంగా అన్ని ఎన్నికలు గెలిచిన మేము ఎలా ప్రవర్తించి ఉండాలో ఆలోచించుకోండి.” సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ మీద, ఒక క్రిస్టియన్ మైనారిటీ సోదరుడి మీద జరిగిన ఈ దాడిని తాను పూర్తిగా ఖండిస్తున్నానని, ఈ దాడికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా చేస్తున్న రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాకేష్ క్రిస్టోఫర్ కుటుంబ సభ్యులందరినీ కలిసినట్టు కేటీఆర్ తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డి , సునీత , కౌశిక్ రెడ్డి , కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్లు సహా నాయకులందరం కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వచ్చామని వెల్లడించారు. కార్యకర్తలకు భరోసా ఇస్తూ, “జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా, కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వారి ఇంటి ముందుకు వస్తాం,” అని హామీ ఇచ్చారు. చివరగా, ఇన్ని రిగ్గింగ్లు, గూండాగిరి, దొంగ వోట్లు, పైసలు, చీరలు, కుక్కర్లు పంచినా కూడా మా అభ్యర్థికి 75,000 వోట్లు వచ్చాయని, ఇది స్వల్ప సంఖ్య కాదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు సంయమనంతో వ్యవహరించకపోతే, తప్పకుండా బుద్ధి చెప్పే విధంగా ప్రజల్ని చైతన్యం చేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని, ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా మాట్లాడతామని, భవిష్యత్తులో జూబ్లీహిల్స్లో మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు





