దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి
•తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరు.
•వన్ ట్రిలియన్ డాలర్ల జీడీపీ అసాధ్యమేమీ కాదు
•హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంంత్ర, ఫిబ్రవరి 27 : దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణకు దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వొచ్చాయని, ఉద్యోగ కల్పనలో నెంబర్ వన్ గా నిలిచామని ఆయన అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ లో హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లో హెచ్సీఎల్ కేఆర్సీ క్యాంపస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిరోజూ బహుళజాతి సంస్థలతో కొత్త అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం.. పెద్ద సంస్థలు తెలంగాణకు రావడమో.. గత సంవత్సరం సంతకం చేసిన ఎంవోయుల కొత్త సౌకర్యాలను ప్రారంభించడమో జరుగుతోందన్నారు.
మన వద్ద అత్యధిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నాయి. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా మారుస్తానని తాను ముందే చెప్పినప్పుడు.. అది సాధ్యం కాదని కొందరు అన్నారు. రెండుసార్లు దావోస్ పర్యటనల్లో రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు అది సాధ్యమని నమ్ముతున్నారు. తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరు. మా పోటీ ముంబై, దిల్లీ, బెంగళూరు లేదా చెన్నైతో కాదని నేను చెప్పినప్పుడు.. కొంతమంది అది పెద్ద కలనే అవుతుందన్నారు. ఈవీ అడాప్షన్ లో హైదరాబాద్ను నంబర్ వన్ గా చేశాక రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ కు హబ్ గా మారుస్తున్నాం.. ఇప్పుడు హైదరాబాద్ రైజింగ్ ఆగదు అని ప్రజలే అంటున్నారు.
నేను మొదట తెలంగాణ రైజింగ్ అని చెప్పినప్పుడు కొందరికి ఖచ్చితంగా తెలియదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది. నేను మొదట హైదరాబాద్ రైజింగ్ అని చెప్పినప్పుడు కొందరికి అనుమానం వొచ్చింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్ ను కొద్దిరోజుల క్రితం ప్రారంభించుకున్నాం. మేం ప్రపంచంలోని అత్యుత్తమ సమావేశాలలో ఒకటైన బయో ఏషియాను నిర్వహించాం.. ఇవాళ హెచ్సీఎల్లో ఉన్నాం గ్లోబల్ కంపెనీగా హెచ్సీఎల్ టెక్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇది 60 దేశాలలో ఆపరేట్ చేస్తోంది. 2.2 లక్షల మందికిపైగా ఉద్యోగులను కలిగి ఉంది. డిజిటల్, ఇంజినీరింగ్, క్లౌడ్, ఏఐ రంగాల్లో ప్రపంచస్థాయి ఉద్యోగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారు. 2007లో హైదరాబాద్ వొచ్చినప్పటి నుంచి అంచెలంచెలుగా %•••% పెద్ద స్థాయికి ఎదిగింది. అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 5 వేల మందితో కేఆర్ సీలో ప్రపంచస్థాయి సదుపాయంతో హెచ్ సీఎల్ టెక్ హైదరాబాద్ లో గొప్ప పనులు చేస్తుందన్నారు. .