వికసిత్‌ ‌భారత్‌ ‌దిశగా తెలంగాణ రైజింగ్‌

అట్టహాసంగా తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌
-ప్రారంభించిన గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ
 -2047 ‌నాటికి 3 ట్రిలియన్‌ ‌డాలర్లకు ఎదగాలని ఆకాంక్ష

నెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌ఘనంగా ప్రారంభమైంది. సమ్మిట్‌ను గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ ప్రారంభించారు.సోమవారం ఫ్యూచర్‌ ‌సిటీలో తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ‌వర్మ మాట్లాడుతూ.. తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వం దోహదపడుతోందని గవర్నర్‌ ‌పేర్కొన్నారు. సమ్మిట్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, దేశ విదేశాల నుంచి వొచ్చిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. పెట్టుబడులు, ఉపాధి, ఇన్నోవేషన్‌ ‌ప్రధాన లక్ష్యంగా 27 అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ…నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ వెల్లడించారు. వికసిత్‌ ‌భారత్‌ ‌దిశగా తెలంగాణ రైజింగ్‌ ‌కొనసాగుతోందన్నారు. 3 ట్రిలియన్‌ ‌డాలర్ల ఎకానగా మారాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వొస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా రైతులను పలు విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. బస్సుల నిర్వహణ కూడా మహిళా సంఘాలకు ఇచ్చామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో స్థిరమైన, పారదర్శకమైన ప్రభుత్వం ఉందని గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌విజయవంతమైందని నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాశ్‌ ‌సత్యార్థి తెలిపారు. తెలంగాణ ప్రత్యేక విజన్‌తో ముందుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 20 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్పారు. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని గుర్తు చేశారు. వికసిత్‌ ‌భారత్‌ ‌లక్ష్యం దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. సంస్కృతి,కళలు,టెక్నాలజీ,పరిశ్రమల హబ్‌గా తెలంగాణ ఉందన్నారు. ఐకమత్యంతోపాటు శాంతియుత పరిస్థితులతోనే అభివృద్ధి సాధ్యమని కైలాశ్‌ ‌సత్యార్థి వివరించారు. తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌సోమవారం ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌ ‌మంగళవారంతో ముగియనుంది. ఈ సమ్మిట్‌కు సీఎం రేవంత్‌ ‌రెడ్డితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తోపాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, అతిథులు ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. దేశ, విదేశీ ప్రముఖులు ఈ సమ్మిట్‌కు హాజరయిన నేపథ్యంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *