- కాంప్రెహెన్సివ్ రోడ్డు మ్యాప్ సిద్ధం
- ‘ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్’లో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర | 2030 నాటికి తెలంగాణను దేశ “ఏరో ఇంజిన్ రాజధాని”గా (Aero Engine Capital) తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇందుకోసం ప్రపంచంతో పోటీపడేలా దిగ్గజ పరిశ్రమలు, ప్రముఖ విద్యాసంస్థల భాగస్వామ్యంతో “ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్”ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు కాంప్రెహెన్సివ్ రోడ్డు మ్యాప్ ను రూపొందిస్తున్నామన్నారు. ‘ఎండ్ టూ ఎండ్ ఎకోసిస్టం’ కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన పునాదులే ప్రస్తుతం తెలంగాణను దేశ స్ట్రాటెజిక్ డిఫెన్స్ హబ్ గా మార్చాయని వివరించారు. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ మెంట్, ఐఎస్ బీ, ముంజాల్ ఇన్సిట్యూట్ ఫర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గచ్చిబౌలి లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ)లో నిర్వహించిన ‘ఎంపవరింగ్ ఆత్మనిర్భర్ భారత్: ఇండియాస్ ఏరోస్పేస్ & డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ఏఅండ్ డీ రంగంలో నమోదవుతున్న వేగవంతమైన వృద్ధిని మనకు అనుకూలంగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాల వల్ల గ్లోబల్ సప్లై చెయిన్ ఒత్తిడికి గురవుతుందని, ఈ తరుణంలో విశ్వసనీయమైన సరఫరాదారుల కోసం ప్రపంచం ముఖ్యంగా ‘భారత్’ లాంటి దేశాలవైపు చూస్తోందన్నారు. గతేడాది దేశ రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటిందన్నారు. రక్షణ రంగ ఎగుమతుల్లో 12 శాతం వృద్ధి రేటు నమోదు కావడం ఈ రంగ పురోగతికి నిదర్శనమన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్య సాధనలో ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్’ రంగం కీలక పాత్ర పోషించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో 25కు పైగా ‘ఏఅండ్ డీ’ అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలు, సుమారు 1500కు పైగా ఎంఎస్ఎంఈలు ‘తెలంగాణ బ్రాండ్’ ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ఏరోస్పేస్ ఎగుమతుల విలువ 2023-24లో రూ.15,900 కోట్లు కాగా 2024-25లో కేవలం మొదటి తొమ్మిది నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరగడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిలువెత్తు సాక్ష్యమన్నారు. ఆదిభట్లలో రూ.425 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ‘టాటా–సాఫ్రాన్’ ఫెసిలిటీ ఇటీవల అందుబాటులోకి వచ్చిందన్నారు. త్వరలోనే రూ.800 కోట్లతో జేఎస్ డబ్ల్యూ డిఫెన్స్ ‘యూఏవీ మాన్యూఫ్యాక్చరింగ్ యూనిట్’, రూ.500 కోట్లతో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ డిఫెన్స్ ఫెసిలిటీ కూడా వస్తాయన్నారు. ఈ తరహాలోనే పెట్టుబడులు పెట్టేందుకు మరికొన్ని దిగ్గజ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో హీరో ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ కాంత్ ముంజాల్, ఐఎస్ బీ డీన్ ప్రొఫెసర్ పి.మదన్, ప్రొఫెసర్ చందన్ చౌదరి పాల్గొన్నారు.





