- బీజేపీవి దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనం
- కృత్తిమ వివాదాలు సృష్టించడం బిజెపి నైజం
- రాష్ట్రపతితో అన్ని అవాస్తవాలనే చెప్పించారు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకు లేనిపోని వివాదాలను సృష్టిండం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో అన్ని అవాస్తవాలనే కేంద్ర ప్రభుత్వం చేర్చిందని సీతక్క ఫైర్ అయ్యారు. సామాన్యులను పూర్తిగా రాష్ట్రపతి ప్రసంగం విస్మరించిందని.. నిరుద్యోగ సమస్య, ఆర్థిక రంగ ఒడిదుడుకులను రాష్ట్రపతి ప్రసంగంలో కనిపించలేదన్న విషయాన్ని కప్పిపుచ్చేందుకే సోనియా గాంధీ వ్యాఖ్యలపై వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ఆదివాసీ రాష్ట్రపతిని అవమానలపాలు చేసేలా నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ వ్యవహరించిందని గుర్తు చేశారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వనించకుండా బీజేపీ తన కురుచబుద్దిని ప్రదర్శించిందని ఫైర్ అయ్యారు. ఆయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వనించలేదని ఆమె ప్రశ్నించారు.
ఆదివాసీలకు అడుగడునా అన్యాయం చేసి…ఇప్పుడు రాష్ట్రపతి అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. అటవీ హక్కు చట్టాన్ని నీరుగార్చి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇష్టారీతిన మైనింగ్ కు అనుమతులిస్తూ, పెసా చట్టాన్ని తుంగలో తొక్కిన బీజేపీ..ఆదివాసీల గౌరవం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల ప్రాయోజనాలు కాదని..ఆదానీకి వంత పాడే బీజేపీ.. రాష్ట్రపతి పదవిని అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు.