‘సోలార్‌’ వినియోగంపై తెలంగాణ ఆసక్తి

– మీ ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తాం
– జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: రాష్ట్రంలో విద్యుత్‌ రంగం బలోపేతంలో భాగంగా సోలార్‌ విద్యుదుత్పత్తి, వినియోగంలో ఆసక్తిగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ రంగంపై ఆసక్తిగా ఉందని తెలుసుకొని కొన్ని ప్రతిపాదనలతో వచ్చినట్టు జర్మనీ ప్రతినిధులు తెలుపగా ఆయన పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, వాటి లబ్ధిదారులకు సోలార్‌ విద్యుత్‌ అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రతినెలా కచ్చితమైన ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. జర్మన్‌ ప్రతినిధులు సూచించిన సోలార్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలో ఏ విధంగా అనుసంధానం చేసుకోగలం, తెలంగాణ విద్యుత్‌ రంగాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేసుకోవడానికి జర్మన్‌ బృందం ప్రతిపాదనలు ఏ మేరకు ఉపయోగపడతాయో అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విద్యుత్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ను ఆదేశించారు. సమావేశంలో ట్రాన్స్‌కో సీఎం డి.కృష్ణ భాస్కర్‌, ఎస్పీడీసీఎల్‌ సీఎండి ముషారఫ్‌ ఫారుఖి, రెడ్కో సీిఎండీ అనిలా, జర్మన్‌ ప్రతినిధులు డాక్టర్‌ సెబాస్టియన్‌, డాక్టర్‌ రఘు చలిగంటి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *