మంత్రి పొన్నం నివాళి
కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 28 : మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నరసింహారావు 104 వ జయంతి సందర్భంగా పీవీ జ్ఞానభూమిలో పీవీ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ అనేక సంస్కరణలు చేశారు. మానవ వనరులకు సంబంధించిన విద్యా వ్యవస్థలో నవోదయాలు, గురుకులాలను ప్రవేశపెట్టారు. దేశం తన కాళ్ల మీద తాను నిలబడేలా ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు. ఆయన స్మారకార్థం వంగరలో స్మృతి వనం పూర్తి చేసే కార్యాచరణ తీసుకున్నామని తెలిపారు. వొచ్చే జయంతి వరకు మెమోరియల్ సెంటర్ మ్యూజియం ఏర్పాటు చేస్తాం. మా గురువు చొక్కారావుకి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. నేటి యువతకు పీవీ నరసింహారావు స్పూర్తి. కింది స్థాయి నుంచి ప్రధాని వరకు ఎదిగిన ఒదిగిన వ్యక్తి ఆయన. ఆయన ఆర్థిక సంస్కరణలు, విద్యా వ్యవస్థలో చేసిన మార్పులు ఆదర్శనీయం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.



