బసవన్న బాటలో ప్రజా ప్రభుత్వం

సమాజ మార్పునకు పునాదులు వేసిన బసవేశ్వరుడు
వరంగల్ సభలో ప్రభుత్వంపై అసత్య ప్రచారం..
సభలో నా పేరు కూడా పలకలేక పోయారు
కడుపునిండా విషం పెట్టుకుని విద్వేష ప్రసంగం
మరో పదేళ్ల పాటు ప్రజలు మెచ్చేలా పరిపాలిస్తాం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30:  బసవన్న స్ఫూర్తితో తమ ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 12వ శతాబ్దంలోనే సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడని గుర్తుచేశారు. ఆయన జయంతి రోజున పదో తరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం సంతోషకరమని అన్నారు. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బసవన్న అని తెలిపారు. బసవేశ్వర స్ఫూర్తితోనే పంచాయతీ రాజ్ పార్లమెంటరీ వ్యవస్థను మనం తెచ్చుకున్నామని, ప్రతీ మనిషి గౌరవంగా బతికేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలన్నారు.  పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలను ఎత్తి చూపేందుకే ప్రతిపక్షం అనే వ్యవస్థ ఉంది. ఇటీవల ఒకాయన వరంగల్ లో సభ పెట్టి కాంగ్రెస్ ను విమర్శించారు.

వారు రజతోత్సవాలు, విజయోత్సవాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్టీసీ నుంచి బస్సులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. వరంగల్ సభలో మేం చేసిన మంచిని అభినందించి ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావించి ఉంటే నిజంగానే ప్రజలు ఆయన్ను అభినందించే వారు. ఇన్నాళ్లుగా ఆయన ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు తీసుకున్నారు.. ఇది ఏ చట్టంలో ఉంది? అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా రూ. 65 లక్షలు, వాహనాలు, పోలీస్ భద్రత తీసుకున్నారు. మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేయకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  ఫామ్ హౌస్ లో పడుకుని ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు? సంక్షేమ పథకాలు ఆగిపోయాయని ఆయన మాట్లాడారు. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి వీటిలో ఏది ఆగిపోయింది? మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం.. ఇవేవీ మీకు కనిపించడం లేదా?  మీరు ఏ మత్తులో తూగుతున్నారో మీకే తెలియాలి.

కడుపునిండా విషం పెట్టుకుని విద్వేష పూరితప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలు విజ్ఞులు.. ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు.  పదేళ్లు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తామన్నారు.  అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించడానికి రావాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం, ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు బంధు, 60 వేల ఉద్యోగాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన వీటిలో ఏదైనా అంశంపై కేసీఆర్ చర్చకు రావాలన్నారు.  కేసీఆర్ మాటల్లో.. కళ్ళల్లో విషం కనిపిస్తోంది.  తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? పదేళ్లు దోచుకున్న నీకు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదు. ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం.

వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు కెసిఆర్ వరంగల్ వెళ్లారు. ఆయన వరంగల్ వెళ్లి పాపాలు కడిగేసుకున్నానుకుంటున్నారు.. కానీ అక్కడికి వెళ్లి అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారు. వరంగల్ సభలో నా పేరు కూడా పలకలేకపోయారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో రాష్ట్ర ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి అనే విధానంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయడమే తమ పని అని, ప్రచారం చేయాల్సింది  ప్రజలే..  మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page