సమాజ పరివర్తనకు తపించిన మహనీయుడు బసవేశ్వరుడు

రాష్ట్ర సంపదలోని ప్రతి పైసా ప్రజల కోసమే వెచ్చిస్తున్నాం..
కుయుక్తులు పన్నేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30:  సమాజ పరివర్తన కోసం తన జీవితాన్ని అర్పించిన మహాత్మా బసవేశ్వరుడి స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.  హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన మహాత్మా బసవేశ్వర 892 జయంతి వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. దేశంలో ఉన్న అనేక రుగ్మతలపై పోరాటం చేసి సమ సమాజ స్థాపన జరగాలని కుల మతాలకతీతంగా మనుషులంతా ఒకటేనని 12వ శతాబ్దంలోనే చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడని అన్నారు. బసవేశ్వరుడిని మతతత్వవేత్తగా చూడడం కోసం కొంతమంది యత్నం చేస్తున్నారని ఇది సరికాదని అన్నారు. బసవేశ్వరుడు మతతత్వవేత్త కంటే సోషల్ రిఫార్మిస్టు సామాజిక పరివర్తన కోసం తన జీవితాన్ని అర్పించిన  గొప్ప నాయకుడని అన్నారు.  సమ సమాజ స్థాపన కోసం పనిచేయడమే కాదు సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పారని  పనిని దైవత్వంగా చూస్తూ పనిచేయాలని చెప్పిన గొప్పవాడు అంతే కాకుండా శ్రమే సౌందర్యం అన్నాడని భట్ట విక్రమార్క గుర్తుచేశారు. సమాజంలో ఉన్న అందరు సమానంగా బతకాలి. సమాన అవకాశాలు రావాలి. ఎవరినీ ఎవరు కించపరచుకోవద్దు.

అనగదొక్కుకోవద్దు అని చాటి చెప్పారని తెలిపారు.  సమాజ పరివర్తన కోసం చేస్తున్న బసవేశ్వరుడి మాటలకు  ఆకర్షితులై ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అతనికి అనుచరులుగా మారుతున్న క్రమంలో ఆ రాజ్యానికి రాజుగా ఉన్న మీజ్జాల రాజు తన రాజ్యానికి బసవేశ్వరుడిని మంత్రిగా నియమించారు. ఆనాటి రాచరిక వ్యవస్థలోనే మంత్రిగా ఉన్న బసవేశ్వరుడు ప్రజలకు భావ స్వేచ్ఛ ఉండాలని ప్రజలందరి అభిప్రాయాలు వినాలని అనుభవ మండపాలను ఏర్పాటు చేశారు. బసవేశ్వరుడు స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్తు మంత్రి మండలి ముందుకు పోతున్నది. బసవేశ్వరుడి స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించి ప్రజలు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకొని పాలన అందిస్తున్నాం.   సమాజంలో సమానత్వం కలిగి ఉండాలని చాటి చెప్పిన బసవేశ్వరుడి మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసి వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకటే ప్రాంగణంలో అందరూ సమానంగా చదువుకోవాలని రూ.11600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.  పురుషులతో పాటు మహిళలను కూడా సమానంగా గౌరవించాలన్న బసవేశ్వరుడి స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రంలోని మహిళలకు 21 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం.

మహిళలను కోటీశ్వరులుగా చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు పోతోంది. శ్రమే సౌందర్యం అని చెప్పిన బసవేశ్వరుడి మాటలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులు వారి కాళ్లపై వారు ఆర్థికంగా నిలదొక్కు కోవడానికి  రూ.9వేల కోట్లను రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు అందిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. సమాజంలో ఉన్న రైతులను ప్రోత్సహించాలని రైతులకు మేలు చేయాలని ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడమే కాకుండా ఎకరానికి ప్రతి సంవత్సరం రూ.12 వేల రైతు భరోసా అందిస్తున్నామన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే, బసవేశ్వరుడు, అంబేడ్కర్ స్ఫూర్తితో రాష్ట్ర సంపదలోని ప్రతి పైసను ప్రజలకు పంచే పనిలో ఉన్నాం. బలహీన వర్గాలకు మేలు జరగాలని తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేసి 56% బీసీలు ఉన్నారని, వారికి 42 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించాలని చట్టసభల్లో బిల్లు పెట్టి పాస్ చేయించి ముందుకు తీసుకుపోతున్నాం. ఈ విధంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేకపోయింది  శాస్త్రీయంగా కుల గణన సర్వే చేసి దాని ఆధారంగా వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం దేశానికి  రోల్ మోడల్ గా నిలువబోతున్నది.

ప్రతిపక్షల విమర్శలు అర్థరహితం..
వరంగల్ లో బిఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో ప్రజా ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఒక పెద్దాయన విమర్శలు చేశారని భట్టి విక్రమార్క మండిపడ్డారు.  ప్రజా ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందిందని ప్రశ్నించారు.  బసవేశ్వరుడి స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారంగా స్కీములు తీసుకురావడం వైఫల్యం చెందినట్టా? అని నిలదీశారు. కొలువుల కోసం  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం వైఫల్యమా? నిరుద్యోగులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్వయం ఉపాధి పథకాలు ఇవ్వడం నేరమా?  అని అన్నారు.

సమాజం మార్పు మీద ఏ మాత్రం ప్రేమ ఉన్న ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి అన్నింటిలో విఫలమయ్యారని మాట్లాడటం విచారకరమని అన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఈ దేశంలో భూ సంస్కరణలు అమలు చేయాలని చట్టం తీసుకొచ్చిన క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న నాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని నేరుగా ఎదుర్కోలేక కొంతమంది దొరలు కృత్రిమంగా జై ఆంధ్ర ఉద్యమాన్ని తీసుకువచ్చి పరోక్షంగా అడ్డుకునే కుట్ర చేశారని తెలిపారు. పెద్ద సామాజిక మార్పునకు నాంది కాబోతున్న కుల గణన సర్వేను అదే తరహాలో బిఆర్ఎస్, బిజెపి నాయకులు బీసీలకు మేలు జరగకుండా అడ్డుకోవడానికి, నేరుగా వ్యతిరేకించకుండా ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేల్చుతూ కుయుక్తులు పన్నుతున్నారన్నారు. అంబేడ్కర్, బసవేశ్వరుడు, పూలే ఆలోచనలు అనుసరించేవారు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని,  ఆ మహనీయుల ఆలోచనలకు విరుద్ధంగా కుయుక్తులు పన్నే వారి పట్ల సమాజం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page