అనవసర నేతలను విచారిస్తున్న సిట్
ఫిర్యాదు చేసిన తనను మాత్రం దూరం పెట్టారు
దుబ్బాక నుంచే ట్యాప్ అయినట్లు పలుమార్లు ఫిర్యాదు
మెదక్ బిజెపి ఎంపి రఘునందన్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: దుబ్బాక ఉప ఎన్నికలతోనే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైందని.. మొట్ట మొదటిసారిగా తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని డీజీపీకి అనేక సార్లు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్తో సంబంధంలేని కాంగ్రెస్ నాయకులను సిట్ పిలుస్తోందని.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ అయ్యింది తనదన్నారు. మమ్మల్ని అడిగితే అన్ని వివరాలు ఇచ్చే వాళ్ళమన్నారు. ఫోన్ ట్యాపింగ్లో గాడిదగుడ్డు తప్ప చర్యలు ఉండవని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మూలాఖత్ అయ్యాయని విమర్శించారు. ఫిర్యాదు చేసిన తమను సిట్ ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. రోజుకు ఒక్కరిని మాత్రమే విచారణ చేయడానికి ఇదేమైనా డైలీ సీరియలా అని ప్రశ్నించారు. ఆధారాలు ఇచ్చే వాళ్లను పక్కన పెట్టి డైలీ సీరియల్ నడుపుతున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రచార ఆర్భాటాలు తప్ప మరొక్కటి లేదని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. బెదిరింపు కాల్స్పై విచారణ జరుగుతుందని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారని తెలిపారు. నియోజకవర్గానికి వెళ్లినప్పుడు సమాచారం ఇస్తే ఎస్కార్ట్, ముగ్గురు సిబ్బందిని ఇస్తామన్నారన్నారు. కాంగ్రెస్ 18 మాసాల పాలనపై సక్షించు కోకుండా రోజుకొక కొత్త కథతో ముందుకు వస్తోందని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ మేయర్ ఐదు రూపాయల భోజనం పేరు మారుస్తున్నట్లు ప్రకటించారని.. అన్నపూర్ణ క్యాంటీన్ పేర్లను ఇందిరమ్మ పేరు పెట్టడం దౌర్భాగ్యమన్నారు. ఇందిరమ్మ పేరు చెబితే ఎమర్జెన్సీ గుర్తుకు వస్తుందనే ఇంగిత జ్ఞానం లేకుండా ఇందిరమ్మ పేరు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. మేయర్ దృష్టి పెట్టాల్సింది కుక్కల బెడద, సమస్యలపైన కానీ పేర్ల మార్పు ద కాదు అంటూ హితవుపలికారు. పథకాల పేర్లు మార్చడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ కార్యకర్తలకు తప్పితే ఇళ్ళు లేని వాళ్లకు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలకు సవాల్ విసురుతున్న.. ఇళ్లులేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని నిరూపించాలన్నారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామానికైనా వెళ్లి పరిశీలించాలన్నారు. ’కవిత ఎవ్వరూ.. కవిత బీసీనా. అధికారంలో ఉన్న పదేళ్లు ఎందుకు బీసీలు గుర్తుకురాలేదు. బీసీలకు అధ్యక్ష పదవి, ఎల్పీనేత పదవులు ఇవ్వకుండా బీసీ ఉద్యమం చేస్తామంటే ఎట్లా? మతపరమైన రిజర్వేషన్లు తొలగిస్తే.. రాజ్యాంగ సవరణ చేస్తాం’ అని ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు.





