కొత్త ఎన్నికల సంస్కరణలతో జూబ్లీహిల్స్‌ ఎన్నిక

– రాజకీయ పార్టీలతో సీఈవో సుదర్శన్‌రెడ్డి సమావేశం
– ఏర్పాట్లపై సంబంధిత శాఖలతో సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను ముఖ్య ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) గ్యానేశ్‌కుమార్‌ ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఎన్నిక ఏర్పాట్ల‌పై సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో మంగ‌ళ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొత్త సంస్క‌ర‌ణ‌ల గురించి వివ‌రించారు. ఈ సంస్కరణలు తొలిసారిగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా జరుగుతున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి వస్తున్నాయని తెలిపారు. ఈ సంస్కరణల లక్ష్యం ఓటర్ల సౌకర్యం, పారదర్శకత, ఎన్నికల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమేనని తెలిపారు. ఆ స్కంరణలు ఇలా ఉన్నాయి. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు. ఓటర్లు తమ అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకు ఈవీఎంలపై రంగు ఫొటోలు ఉంచడం. మహిళా ఓటర్ల వోటింగ్‌ పెంచేందుకు మహిళా సిబ్బందిని అదనంగా నియమించడం. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌ చెయిర్లు, ర్యాంపులు, పిక్‌-అప్‌/డ్రాప్‌ సదుపాయాలు కల్పించడం ప్రధానమైనవి. అలాగే రియల్‌టైమ్‌ ఓటింగ్‌ టర్నౌట్‌ మానిటరింగ్‌ కోసం డిజిటల్‌ డ్యాష్‌బోర్డులు, మొబైల్‌ యాప్‌లు. సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత పర్యవేక్షణ, జీపీఎస్‌ ట్రాకింగ్‌. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) ఉల్లంఘనలపై కఠిన చర్యలు, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ. పర్యావరణహిత ఎన్నికలుI పేపర్‌ వినియోగం తగ్గించడం, డిజిటల్‌ సమాచార మార్పిడి ప్రోత్సాహం వంటివి ఈ సంస్కరణల్లో ఉన్నాయి. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలతో ఏర్పాట్లపై సీఈవో సుదర్శన్‌రెడ్డి సమీక్షించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించి ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు సహకరించాలని సూచించారు. సమావేశంలో అదనపు సీఈవో లోకేష్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌, ఉప సీఈవోలు హరిసింగ్‌, సత్యవాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *