– సీఎంను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, సురేఖ, అడ్లూరి
– జాతర పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5ః శాసనసభలో మేడారం మహా జాతర సందడి నెలకొంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తోపాటు పలువురు మంత్రులకు జాతర ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా మేడారం ఈవో వీరస్వామి, సమ్మక్క–సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పలువురు పూజారులు ఆలయ సంప్రదాయం ప్రకారం కంకణం కట్టి కండువా కప్పి, బంగారం అందజేసి మేడారం జాతరకు ఆహ్వానించారు. ప్రఖులకు అధికారికంగా ఆహ్వాన పత్రికలు అందజేసి జాతరకు రావాలని మంత్రులు కోరారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది. మేడారం అభివృద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లతో విస్తృత పనులు చేపట్టింది. ఈ నెల 19న సమ్మక్క–సారలమ్మల గద్దెలు, ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ పూజారులు మేడారం మహా జాతర పోస్టర్ను సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. సరికొత్తగా అభివృద్ధి చేసిన మేడారం ఆలయ ప్రాంగణం మరో వెయ్యి సంవత్సరాల పాటు నిలిచేలా, పూర్తిగా రాతి కట్టడాలతో నిర్మితమవుతోంది. సమ్మక్క–సారలమ్మల త్యాగాలు, ఆదివాసీల చరిత్ర ప్రతిబింబించేలా ద్వారాలు, ప్రహరీలు రూపొందించారు. ఆదివాసీ సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆధునికత సమ్మేళనంగా మేడారం ముస్తాబైంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





