– పలువురు అగ్రనేతల లొంగుబాటు
– డీజీపీ శివధర్ ఎదుట లొంగిపోయిన నేతలు
– పుల్లూరి ప్రసాద్ రావు, బండిప్రకాశ్లో లొంగుబాటు
– లొంగిపోయిన వారిని పూర్తిస్థాయిలో ఆదుకుంటామన్న డీజీపీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28:మావోయిస్టులకు మరో దెబ్బతగిలింది. పలువురు అగ్రనేతలు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మంగళవారం లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలవాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చిన క్రమంలో మావోయిస్టులు అజ్ఞాతం వీడారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న, చంద్రన్న, మావోయిస్టు స్టేట్ కమిటీ మెంబెర్ బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోయారు. పుల్లూరిపై రూ.25 లక్షల రివార్డు, బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్పై రూ.20 లక్షల రివార్డు ఉంది. అయితే అజ్ఞాతంలో 64 మంది తెలంగాణ మావోయిస్టులు ఉన్నారు. ఇప్పటి వరకు 427మంది లొంగిపోయారు. అందులో 8 మంది స్టేట్ కమిటీ, ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లు లొంగిపోయారు.తొమ్మిదిమంది మాత్రమే తెలంగాణలో, మిగిలిన వారు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. సెంట్రల్ కమిటీలో 5 మంది తెలంగాణ మావోయిస్టులు ఉన్నారు. 10 మంది స్టేట్ కమిటీ మొంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 20 మంది డిస్ట్రిక్ కమిటీ, 14 మంది ఏరియా కమిటీల్లో, 10 మంది తెలంగాణ కమిటీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులపై ఎలాంటి చర్యలు ఉండవని డీజీపీ శివధర్రెడ్డి స్పష్టం చేశారు. మావోయిస్టుల లొంగుబాటు వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. 1980లో ప్రసాదరావు కిషన్జీకి అనుచరుడిగా మారారు. 1981లో పీపుల్స్వార్లో చేరి 1983లో కమాండర్ అయ్యారు. 1992లో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2008లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు. 17 ఏళ్ల పాటు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డి పిలుపుతో పుల్లూరి ప్రసాదరావు లొంగిపోయారని డీజీపీ తెలిపారు. మావోయిస్టు మరో నేత ప్రభాత్ 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో పనిచేశారు. అతని స్వస్థలం తెలంగాణలోని మందమర్రి. ఏడో తరగతి చదువుతున్నప్పుడే నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. 2004లో జరిగిన శాంతి చర్చల్లో ప్రకాశ్ పాల్గొన్నారు. 2019లో స్టేట్ కమిటీ సభ్యుడ య్యారు. నేషనల్ పార్క్ ఏరియా కీలక ఆర్గనైజర్గా బాధ్యతలు నిర్వహించారు. బండ ప్రకాశ్పై ఉన్న రూ.20లక్షల రివార్డు ఆయనకు ఇస్తాం. పుల్లూరి ప్రసాదరావుపై ఉన్న రూ.25లక్షల రివార్డు ఆయనకు ఇస్తాం. తెలంగాణకు చెందిన ఇంకా 64 మంది మావోయిస్టులు కొనసాగుతున్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేతలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కరెక్ట్ కాదు. అవసరమైతే.. వారికి రక్షణ కల్పిస్తాం అని డీజీపీ తెలిపారు. పుల్లూరి ప్రసాద్ రావ్ అ చంద్రన్నది పెద్దపల్లి మండలమని తెలపారు. చంద్రన్న15 ఏళ్ల కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారని గుర్తుచేశారు. మొదట రాడికల్ స్టూడెంట్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారని వెల్లడించారు. 2008లోనే కేంద్ర కమిటీ మెంబర్గా చంద్రన్న ఉన్నారని తెలిపారు. 2024 డిసెంబర్ వరకు తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నారని వివరించారు. అక్టోబరు 21వ తేదీన సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చంద్రన్న జన జీవన స్రవంతిలో కలిశారని చెప్పుకొచ్చారు. చంద్రన్న ఆరోగ్యం కూడా సహకరించకాపోవడంతో అజ్ఞాతం వీడారని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీలో చీలిక వచ్చిందని లొంగిపోయిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న తెలిపారు. తీవ్ర అనారోగ్య కారణాలతో తాను జనజీవన స్రవంతిలో కలిశానని చెప్పుకొచ్చారు. ఇప్పటి నుంచి ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని వెల్లడించారు. మావోయిస్టు భావజాలానికి తానెప్పుడూ కూడా విజ్ఞుడేనని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీలో వచ్చిన విభేదాలు, చీలికల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నక్సలైట్లు తమ సోదరులని.. లొంగిపోవాలని పిలుపునిచ్చారని తెలిపారు. ఆమేరకు తాము ప్రజలతో కలిసి పని చేయాలని భావించామని పేర్కొన్నారు. అలాగే, తెలంగాణ డీజీపీ పిలుపు మేరకు సరెండర్ అయ్యామని పుల్లూరి స్పష్టం చేశారు.
మాది లొంగుబాటు కాదు – చంద్రన్న
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





