– రంగంలోకి దిగిన ఇద్దరు కేంద్ర బృందం సభ్యులు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి24:నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వివాదంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు సభ్యుల సాంకేతిక కమిటీ సింగరేణి భవనానికి చేరుకుని విచారణను ప్రారంభించింది. సీఎస్ఆర్ నిధుల వినియోగం, టెండర్ నిబంధనలు వంటి అంశాలపై కేంద్ర బృందం ఆరా తీస్తోంది. సింగరేణి సీఎండీ కృష్ణ భాస్కర్ వద్ద ఈ బృందం వివరాలు సేకరిస్తోంది. శుక్రవారం రాత్రి 7 గంటలపాటు విచారణ జరిపింది. నేడు మరోసారి విచారణ చేపట్టిన బృందం వొచ్చే సోమవారం తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. కాగా.. నైనీ బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన సరికాదని, అక్రమాలకు దారి తీస్తుందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టెండర్లను రద్దు చేయాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లలో అవినీతి ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. సమగ్ర విచారణకు సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. ఇద్దరు సభ్యులతో కూడిన కేంద్ర బొగ్గు శాఖ అధికారుల బృందంతో కమిటీ ఏర్పాటైంది. బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, బొగ్గు శాఖ టెక్నికల్ డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం సింగరేణిలో పర్యటించి.. నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దుకు గల కారణాలపై విచారణ జరిపి, ఆ నివేదికను మూడు రోజుల్లో అందజేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.