మా ప్రభుత్వంలో హిందూ, ముస్లిం ఒక్కటే

– ఎలాంటి తారతమ్యం చూపించం
– అజార్‌ను మంత్రిని చేస్తే కిషన్‌రెడ్డికి నొప్పి ఎందుకు?
– పదేళ్లలో అభివృద్ధి పట్టని బీఆర్‌ఎస్‌ ఇపుడు ఓట్లడగమేంటి?
– షేక్‌పేట డివిజన్‌ పారామౌంట్‌ కాలనీలో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రెహమత్‌ నగర్‌లో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాను మొదటినుంచి సెక్యులర్‌ను అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు మైనారిటీలకు అనేక అవకాశాలు కల్పించిందని, వారికి అనేక పెద్ద పదవులు ఇచ్చిందని పేర్కొన్నారు. కొడంగల్‌లో తాను మూడుసార్లు గెలవడానికి మైనారిటీల సహకారం ఎంతో ఉందన్నారు. 20 నెలల కాంగ్రెస్‌ పాలనలో మైనారిటీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఎలా ఇచ్చారని కిషన్‌ రెడ్డి అడుగుతున్నాడంటూ ఆయనకు మంత్రి పదవి ఇస్తే నీకు ఏం ఇబ్బంది అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో హిందూ, ముస్లిం అంతా ఒక్కటే.. మేం ఎలాంటి తారతమ్యం చూపించం అని సీఎం స్పష్టం చేశారు. మోదీ, కేసీఆర్‌ ఒక్కటేనన్నారు. కేసీఆర్‌ ప్రతిసారీ కేంద్రంలో మోదీకి మద్దతు ఇచ్చాడు.. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది.. బీఆర్‌ఎస్‌ ముస్లింలను మోసం చేస్తుంది అని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్‌పై సీబీఐ విచారణ అడిగితే మోదీ పట్టించుకోవడం లేదు.. ఈ కార్‌ రేస్‌ కేసులో కేటీఆర్‌ అరెస్టు కోసం గవర్నర్‌ అనుమతించడం లేదు.. దేశంలో ఈడీ, ఇన్‌కమ్‌ టాక్స్‌, సీబీఐ పేరుతో వేదిస్తున్న మోదీ కేసీఆర్‌, కేటీిఆర్‌ల విషయంలో మాత్రం పర్మిషన్‌ ఇవ్వడం లేదు అని ఆరోపించారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే జూబ్లీహిల్స్‌లో డిపాజిట్‌ తెచ్చుకోవాలి.. జూబ్లీహిల్స్‌ గ్రౌండ్‌లో అసలు బీజేపీనే లేదు అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
సెంటిమెంటా లేక డెవలప్‌మెంటా అన్నది ఆలోచించాలి పీజేఆర్‌ చనిపోయినప్పడు సెంటిమెంట్‌ లేదని కేసీఆర్‌ అన్నాడు.. ఎమ్మెల్యే చనిపోతే ఏకగ్రీవం కాకుండా ఉపఎన్నికలకు నాంది పలికింది ఆయనేనంటూ విమర్శించారు. నాడు పీజేఆర్‌ కుటుంబ సభ్యులను కేసీఆర్‌ అవమానించాడంటూ పీజేఆర్‌ విహారం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సెంటిమెంట్‌ పేరుతో ఓటు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు బెంజ్‌ కారు వదిలి ఆటోలో తిరుగుతూ సమస్యల గురించి మాట్లాడుతున్నారని, జూబ్లీహిల్స్‌లో సమస్యలకు కారణం బీజేపీ, బీఆర్‌ఎస్‌లేనని అన్నారు.

మూడు నెలల్లో సజూ.400 కోట్ల అభివృద్ధి పనులు

కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ని గెలిపిస్తే నియోజవర్గ అభివృద్ధి జరుగుతుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. పదేళ్లలో కేసీఆర్‌ ఏమీ ఇవ్వలేదు.. ఇప్పుడు ఎలా ఓటు అడుగుతాడు అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీి నది అభివృద్ధికి, త్రిబుల్‌ ఆర్‌కు అడ్డుపడుతున్నాడని విమర్శించారు. సవాల్‌ విసిరి పారిపోవడం కేటీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు. గతంలో తాను వైట్‌ ఛాలెంజ్‌ విసిరితే రాకుండా పారిపోయాడు. కంటోన్మెంట్‌లో రూ.4000 కోట్ల అభివృద్ధి పనులు జరగలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా అని కేటీఆర్‌ సవాల్‌ విసిరాడు.. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌ రూ.5000 కోట్ల జీవోలు చూపిస్తే ఆయన పారిపోయాడని తెలిపారు. నవీన్‌ యాదవ్‌ విజయం కోసం ఎంఐఎం నేతలు కష్టపడి పనిచేస్తున్నారు.. 30 వేల మెజారిటీతో నవీన్‌ యాదవ్‌ గెలవబోతున్నాడు.. సిరాజ్‌ కోసం అన్ని నిబంధనలు పక్కనపెట్టి డీఎస్పీగా అవకాశం ఇచ్చాం.. నిక్కత్జరీన్‌ను కూడా డీఎస్పీగా నియమించామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీకి సహకరించకపోతే మోదీ ప్రధాని అయ్యే అవకాశం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ పేరుతో బీజేపీ జూబ్లీహిల్స్‌లో ఓటు అడుగుతోందని తెలిపారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరితే 24 గంటల్లో కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానని కిషన్‌ రెడ్డి అన్నాడు.. విచారణకు ఆదేశించి మూడు నెలలయినా ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో మోదీ, కసీఆర్‌ ఒక వైపు.. రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి, అసదుద్దీన్‌ మరో వైపు అని రేవంత్‌రెడ్డి చెప్పారు.

సినీ కార్మికుల సంక్షేమం చూస్తాం 

యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ కార్నర్‌ మీటింగ్‌లో సీఎం మాట్లాడుతూ పేదోళ్ల గుండె ధైర్యం పీజేఆర్‌ అని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో గత పదేళ్లు బీఆర్‌ఎస్‌, బీజేపీనే అధికారంలో ఉన్నాయి.. నక్కలు మేక తోలు కప్పుకొని వస్తున్నాయి.. కృష్ణా నగర్‌ ఇప్పుడు ఆస్కార్‌ అవార్డులు తీసుకువస్తుంది.. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సినిమా పరిశ్రమకు అండగా నిలబడ్డాయి.. కేసీఆర్‌ పదేళ్లు అధికారంలో ఉన్నా నంది అవార్డు లు ఇవ్వలేదు.. తమ ప్రభుత్వం గద్దర్‌ అవార్డు ు ఇచ్చింది.. కేటీఆర్‌ సినిమా హీరోలతో తిరిగాడు కానీ సినిమా కార్మికులను పట్టించుకోలేదు.. సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తాం.. వారి పిల్లల కోసం స్కూల్‌ ఏర్పాటు చేస్తాం.. మహిళలకు ఉచిత బస్‌ సౌకర్యం కల్పించాం.. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి రూ.6 వేల కోట్లు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తోంది.. మహిళా సంఘాలకు రూ.000 కోట్ల భూమి ఇచ్చి వాళ్ల ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం కల్పించాం.. రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశాం.. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం అని వివరించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే.. కాంగ్రెస్‌ను ఓడిరచడానికి కుట్రలు చేస్తున్నాయి.. కాళేశ్వరంపై సీబీఐ ఎందుకు ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌ చేయలేదు అని ప్రశ్నించారు. కిషన్‌ రెడ్డీ.. నువ్వు ముందు మోదీ ఇంటికి వెళ్లి గజదొంగ కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో అడుగు.. కిషన్‌ రెడ్డీ.. నీకు ఎవరూ భయపడరు ..కేసీఆర్‌నే ఓడిరచి ఫాంహౌస్‌కు పంపాం.. కింగ్‌ అవుతానని కిషన్‌ రెడ్డి అంటున్నాడు.. జూబ్లీహిల్స్‌లో బీజేపీ డిపాజిట్‌ తెచ్చుకుంటే గెల్చుకున్నట్లే .. బీజేపీ, బీఆర్‌ఎస్‌ను బండకేసి కొట్టాలి అని వ్యాఖ్యానించారు. నవీన్‌ యాదవ్‌ విజయం సాధిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి.. నవీన్‌ యాదవ్‌కు 30 వేల మెజార్టీ ఇవ్వాలి అని ఓటర్లకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌, మోదీ ఒకపక్క.. రేవంత్‌, రాహుల్‌ గాంధీ ఒక పక్క ఉన్నారని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *