ఆటల పాటలతో సందడి చేసిన మంత్ర పొన్నం
పిల్లలతో కలిసి భోజనం
లక్ష్య సాధనలో ముందుకు వెళ్లాలని ఉద్బోధ
హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24 : హుస్నాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్లాదంగా గడిపారు. పాటలు పాడుతూ కథలు చెప్పిన విద్యార్థినులను సత్కరించారు. విద్యార్థినులందరినీ దగ్గరకు చేర్చి జీవితంలో లక్ష్య సాధనలో ఎలా ముందుకు సాగాలో, కష్టాలను ఎలా విజయం ఎదుర్కొనాలో కథల రూపంలో వివరించి చెప్పారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.
స్వయంగా వారితో కలిసి కింద కూర్చొని సామూహిక భోజనం చేశారు. వారికి తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రజా ప్రభుత్వం దశాబ్ద కాలం తర్వాత డైట్ చార్జీలు పెంచిందని భోజనం ఎలా ఉందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కామన్ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని బాలికలు తెలిపారు. ఉదయం అల్పాహారం, ఎగ్స్, అరటిపండ్లు, సాయంత్రం అందించే స్నాక్స్ చాలా బాగున్నాయన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు గంటలకు పైగా విద్యార్థినులతో సరదాగా గడపడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
జీవితంలో గెలవాలంటే ఇప్పటి నుండే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని లక్ష్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు పోవాలని అప్పుడే విజయం సాధించగలమని వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అందరూ బాగా చదువుకోవాలని తల్లిదండ్రులకు, గ్రామానికి మన రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. చదువుల్లోనే కాదు ఆటల్లోనే ఇన్నోవేషన్ సైన్స్, రోజురోజుకి పెరుగుతున్న సాంకేతికత నేపథ్యంలో ప్రతి రంగంలో ముందుకు వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థినులకు సూచించారు.