బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరిక
హైదరాబాద్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత (Urea shortage) తో రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అగ్ర తాంబూలం ఇస్తే రేవంత్ ప్రభుత్వం అద:పాతాళానికి తొక్కుతోందని మండిపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. ’నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి ఉండింది. కేసీఆర్ ప్రభుత్వం చెప్పులకు చెక్ పెట్టి రైతుల చెంతకు యూరియా అందించింది. నేడు రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పెయిల్ అయింది. సగంమంది రైతులకు రుణమాఫీ కాలేదు. వడ్లు అమ్మి మూడు నెలలు అయినా రైతులకు రూ.1300 కోట్ల బోనస్ డబ్బులు ఇవ్వలేదు. రుణమాఫీ పేరిట ఎంతకాలం రైతుల ఉసురు పోసుకుంటావ్ రేవంత్ రెడ్డి?. అన్నీ ఎగ్గొట్టడం తప్ప.. రేవంత్ రెడ్డి ఇచ్చింది ఏమిటి?. కేసీఆర్ గోదావరి జలాలతో రైతుల పాదాలు కడిగారు. రేవంత్ రెడ్డి యూరియా కోసం రైతులతో పోలీసుల కాళ్లు మొక్కిస్తున్నారు. ఏ ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్కు ఆ చేతులే గుణపాఠం చెబుతాయి. అందాల పోటీలకు మీటింగ్లు పెట్టావు కానీ రైతుల కోసం ఎందుకు మీటింగ్లు పెట్టడం లేదు. రేవంత్ రెడ్డి చేతగాని ముఖ్యమంత్రి. బడే భాయ్ చోట భాయ్ కలిసి రైతులకు ఏం న్యాయం చేశారు. రైతులకి యూరియా ఇవ్వని కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో తిరిగే హక్కు లేదు. 51సార్లు డిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డికి రైతులకు యూరియా ఇచ్చే దమ్ములేదు, ముందుచూపు లేదు. రాష్టంలో రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ పాలన తెచ్చారు. యూరియా ఇవ్వని కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. వెంటనే రైతులకు యూరియా అందించాలి. లేకుంటే యూరియా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం అని హెచ్చరించారు.