– సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్ 6: అమెరికాలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ ఎలి లిల్లీ (Eli Lilly) తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనున్నది. రూ. 9,000 కోట్లతో హైదరాబాద్లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఐసీసీసీ కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘తెలంగాణ అంటేనే బిజినెస్.. ఎలి లిల్లీ వంటి గ్లోబల్ దిగ్గజాలు ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నందుకు అభినందనలు.. ఇది రాష్ట్రంపై విశ్వాసాన్ని చాటుతోంది.. 1965లో ఇందిరా గాంధీ తీసుకువచ్చిన ఐడిపిఎల్ ద్వారా హైదరాబాద్ ఫార్మా రంగంలో మార్గదర్శకంగా మారింది.. దేశంలో ఉత్పత్తి అయ్యే బల్క్ డ్రగ్స్లో 40 శాతం హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్నాయి.. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీ కేంద్రంగా కూడా హైదరాబాద్ నిలిచింది.. జినోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ (Advanced Therapeutics Center) ఏర్పాటు జరుగుతున్నది.. ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు జరుగుతోంది.. ఇది ఫార్మా రంగానికి అవసరమైన నిపుణుల తయారీకి దోహదపడుతుంది.. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని విధాల మద్దతుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటోంది’ అని వివరించారు. ఫార్మా పాలసీని తమ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకు వెళ్తుంది అని చెప్పారు. సమావేశంలో ఎలి లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, ఎలి లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





