ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రెక్టార్ స్కేల్పై 5.1గా నమోదైంది. తస్నిమ్ న్యూస్ ఎజెన్సీ ప్రకారం ఉత్తర ఇరాన్లోని సెమ్నన్ ఏరియాలో శుక్రవారం ఈ భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ భూకంపంపై ఓ వదంతి షికారు చేస్తోంది. ఇరాన్ న్యూక్లియర్ బాంబు ప్రయోగం చేసిందన్నది దాని సారాంశం. ఇరాన్ న్యూక్లియర్ ప్రయోగాలు చేస్తున్న ప్రాంతానికి దగ్గరలో భూకంపం రావటంతో ఈ ప్రచారం మొదలైంది. సెమ్నన్ స్పేస్ సెంటర్, సెమ్నన్ మిస్సైల్ కాంప్లెక్స్లు భూకంపం సంభవించిన ప్రాంతానికి చాలా దగ్గరలో ఉన్నాయి. కాగా, తొమ్మిది రోజుల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం నడుస్తోంది. మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో జనం మరణిస్తున్నారు. శనివారం ఉదయం కూడా రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఎవరూ చనిపోలేదని, స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే సంభవించిందని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ ప్రకటించింది.
ఇరాన్ను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ తిప్పలు
ముస్లిం దేశాల్లో కేవలం పాకిస్తాన్ దగ్గర మాత్రమే అణు బాంబులు ఉన్నాయి. ఇరాన్ చాలా ఏళ్ల నుంచి అణు బాంబులు తయారు చేయడానికి చూస్తోంది. ఒక వేళ ఇరాన్ అణు బాంబులు తయారు చేసుకుంటే.. తమకు ముప్పు తప్పదని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఇరాన్ అణు బాంబు ప్రయోగాలను అడ్డుకోవడానికి చూస్తోంది. తొమ్మిది రోజుల క్రితం ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇక, అప్పటినుంచి రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం విదితమే.





